79శాతం మంది ఎన్డీయేకే మద్దతు: ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే

by Dishanational5 |
79శాతం మంది ఎన్డీయేకే మద్దతు: ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే
X

దిశ, నేషనల్ బ్యూరో: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరోసారి భారీ విజయం సాధించనుందని బుధవారం విడుదలైన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే వెల్లడించింది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పలు అంశాలపై ఆసియానెట్ న్యూస్ నెట్‌వర్క్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఈ నెల 13 నుంచి 27మధ్య ఇంగ్లీష్, హిందీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, బంగ్లా, మరాఠీ భాషల్లో ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో డిజిటల్ సర్వే నిర్వహించగా, 7.59లక్షల మంది ఇందులో పాల్గొన్నారు. ఈ సర్వే ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. వాటి ప్రకారం, సర్వేలో పాల్గొన్నవారిలో 79శాతం మంది ఎన్డీయే కూటమికే మద్దతిస్తామని వెల్లడించారు. మిగిలినవారు ప్రతిపక్ష ఇండియా కూటమి వైపు నిలిచారు. పౌరసత్వ సవరణ చట్టం నిబంధనలను నోటిఫై చేయాలన్న మోడీ ప్రభుత్వ నిర్ణయం.. ఈ ఎన్నికల్లో సానుకూలంగా మారిందని 51.1శాతం మంది అభిప్రాయపడ్డారు. మోడీ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయాన్ని రేట్ చేయమని అడగగా, 38.11శాతం మంది మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను ప్రశంసించారు. మరో 26.41శాతం మంది ప్రభుత్వ డిజిటల్ ఇండియాను మెచ్చుకోగా, 11.46శాతం మంది ‘ఆత్మనిర్భర్ భారత్’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నారు. హిందీ రాష్ట్రాల్లో 30.04శాతం మంది రామమందిర నిర్మాణం మోడీ ప్రభుత్వానికి అతిపెద్ద విజయంగా పేర్కొన్నారు. తెలుగు ప్రజల నుంచి సైతం ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. మొత్తంగా 57.16శాతం మంది రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయంలో రామమందిరమే కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.



Next Story

Most Viewed