IPL 2023: ధోనీ గాయంతోనే ఆడాడు.. సీఎస్‌కే కోచ్‌

by Disha Web Desk 13 |
IPL 2023: ధోనీ గాయంతోనే ఆడాడు.. సీఎస్‌కే కోచ్‌
X

చెన్నయ్: రాజస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో చెన్నయ్ సూపర్ కింగ్స్ తృటిలో విజయానికి దూరమైన విషయం తెలిసిందే. సీఎస్కే కెప్టెన్ ధోనీ ఆఖర్లో పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ధోనీ గాయంతోనే ఆడాడట. ఈ విషయాన్ని చెన్నయ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపాడు. మ్యాచ్ అనంతరం ధోనీ గాయంపై ఫ్లెమింగ్ స్పందించాడు.

రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ధోనీ మోకాలి గాయంతోనే బరిలోకి దిగాడని చెప్పాడు. ‘మ్యాచ్‌లో ధోనీ కొన్నిసార్లు గాయంతో కాస్త ఇబ్బందిపడ్డాడు. అయితే, అతను అత్యుత్తమ ఆటతీరును కనబర్చాడు. సీజన్‌కు ప్రారంభానికి కొన్ని నెలల ముందు నుంచే అతను రాంచీలో ప్రాక్టీస్ చేశాడు.

అలాగే, నెల రోజుల ముందే జట్టు శిబిరంలో చేరాడు. ధోనీ ఫిట్‌నెస్ స్థాయి ప్రొఫెషనల్‌గా ఉంటుంది. అతడి ఆటపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. ధోనీ తన అత్యుత్తమ ప్రదర్శనను కొనసాగిస్తూనే ఉంటాడు’ అని తెలిపాడు. అలాగే, చెన్నయ్‌ని గాయాలు వేధిస్తున్నాయి.

ఇప్పటికే స్టార్ పేసర్ దీపక్ చాహర్ గాయం బారిన పడగా.. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్ సిసాండ మంగల గాయపడ్డాడు. అశ్విన్ క్యాచ్‌ అందుకునే క్రమంలో అతిని చేతి వేలికి గాయమైంది. దీంతో ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు మాత్రమే చేశాడు. అయితే మంగల గాయాన్ని వైద్యులు పరిశీలించగా.. అతనికి రెండు వారాల పాటు విశ్రాంతి సూచించారు.



Next Story

Most Viewed