పల్లెల్లో జనాన్ని పడుకోబెడుతున్న ఆల్ఫాజోలెం.. మృత్యుఒడిలోకి నెడుతున్న డ్రగ్

by Disha Web Desk 1 |
పల్లెల్లో జనాన్ని పడుకోబెడుతున్న ఆల్ఫాజోలెం.. మృత్యుఒడిలోకి నెడుతున్న డ్రగ్
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : ఆల్ఫాజోలెం.. కల్లు రూపంలో వేలాది మందిని క్రమంగా మృత్యు ఒడిలోకి నెడుతున్న డేంజరస్​డ్రగ్. డ్రగ్ ​ఫ్రీ స్టేట్ ​లక్ష్యంతో ఏర్పాటైన యాంటీ నార్కొటిక్​ బ్యూరో అధికారులు ప్రస్తుతం ఆల్ఫాజోలెంపై ప్రత్యేక దృష్టిని సారించారు. ఈ క్రమంలో ఆల్ఫాజోలెం రాష్ర్టానికి ఎక్కడి నుంచి వస్తోంది, స్థానికంగా తయారవుతుందా, దానిని వినియోగంలోకి తీసుకొస్తున్న ప్రధాన సూత్రధారులెవరు? అన్న దానిపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో డ్రగ్ కంట్రోల్​అడ్మినిస్ర్టేషన్ అధికారులు, ఎక్సయిజ్​శాఖ అధికారులు సమన్వయంతో యాక్షన్ ప్లాన్‌లోకి దిగారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం డ్రగ్స్ ​వాడకం అధికమవుతున్న విషయం తెలిసిందే. బ్రౌన్​షుగర్, హాష్​ఆయిల్, ఎండీఎంఏ, హెరాయిన్​ఇలా చాలా రకాల మాదక ద్రవ్యాలు వేర్వేరు మార్గాల్లో రాష్ర్టానికి చేరుతున్నాయి. అయితే, వీటిలో అన్నింటి కన్నా ఎక్కువగా గంజాయి, ఆల్ఫాజోలెం ఉంది. ప్రతి సంవత్సరం వేల కిలోల గంజాయి పట్టుబడుతుండగా ఆ తరువాతి స్థానంలో ఆల్పాజోలెం పట్టుబడుతోంది. గడిచిన రెండేళ్లలో 293 కిలోల ఆల్ఫాజోలెంను అధికారులు స్వాధీనం చేసుకున్నారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కల్తీ కల్లు తయారీలో...

వేర్వేరు మార్గాల్లో రాష్ర్టానికి చేరుతున్న ఆల్ఫాజోలెంను ప్రధానంగా కల్తీ కల్లు తయారీలో ఉపయోగిస్తున్నారు. సాధారణంగా దీనిని నిద్ర లేమి, యాంగ్జయిటీ సమస్యలతో బాధపడుతున్న వారికి మెడిసిన్‌గా ఉపయోగిస్తారు. ఒక రోగికి ఒకసారి 0.25 గ్రాముల డోసును మాత్రమే ఇస్తారు. దీనికి కారణం ఆల్ఫాజోలెం అత్యంత ప్రమాదకరమైన డ్రగ్​కావటమే. కల్లు తాగే వారికి కిక్​ఎక్కించటానికే కల్లు విక్రయందారులు ఆల్ఫాజోలెంను ఉపయోగిస్తున్నారని తెలంగాణ యాంటీ నార్కొటిక్​బ్యూరో ఛీఫ్​సందీప్​శాండిల్య వెల్లడించారు. పదేళ్ల క్రితం వరకు కల్తీ కల్లు తయారు చేయటానికి డైజోఫాం, క్లోరల్​హైడ్రేట్‌లను వాడు వారు కూడా ఉన్నార. అయితే, ఆ తరువాత డైజోఫాంతో, క్లోరల్ హైడ్రేట్‌తో పోలిస్తే వెయ్యి రెట్లు ఎక్కువగా మత్తు కలిగించే ఆల్ఫాజోలెంను వాడటం మొదలు పెట్టారని పేర్కొ్న్నారు.

10 గ్రాములతో 30వేల సీసాల కల్లు

ఎక్సయిజ్​శాఖకు చెందిన ఓ సీనియర్​అధికారి చెప్పిన ప్రకారం ఆల్ఫాజోలెం దందా చేస్తున్న వారు రూ.లక్షకు పది గ్రాముల చొప్పున అమ్ముతున్నారు. దీనిని కొంటున్న కల్లు దందా చేస్తున్న వారు అదే 10 గ్రాముల ఆల్ఫాజోలెంతో కనీసం 30 వేల సీసాల కల్లును తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్క సీసా కల్లును 45 నుంచి 50 విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో 3‌‌0 వేల సీసాల కల్తీ కల్లు విక్రయాల ద్వారా వ్యాపారులు కనీసంగా రూ.13.50 లక్షలు సంపాదిస్తు్న్నారు. ఇటీవల యాంటీ నార్కొటిక్​బ్యూరో అధికారులు హైదరాబాద్‌లో దాడులు జరిపినపుడు 66 కంపౌండ్లలో కల్తీ కల్లు విక్రయిస్తున్నట్లుగా నిర్ధారణ కావడంతో దందా ఏ స్థాయిలో జరుగుతుందో స్పష్టం అవుతోంది.

అధికంగా ముంబై నుంచి..

తెలంగాణ రాష్ర్టానికి ముంబయి నుంచి ఎక్కువగా ఆల్ఫాజోలెం వస్తోందని యాంటీ నార్కొటిక్​బ్యూరోకు చెందిన ఓ సీనియర్​అధికారి తెలిపారు. హైదరాబాద్​శివార్లతో పాటు రాష్ర్టంలోని మరికొన్ని చోట్ల మూతబడిన పరిశ్రమల్లో కూడా దీని తయారీ కొనసాగుతున్నట్లగా అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఆల్ఫాజోలెం కలిపిన కల్లు తాగడానికి ఒక్కసారి అలవాటు పడితే తాగుబోతులు అది తాగనిదే ఉండలేని పరిస్థితికి చేరుకుంటారని ఎక్సైజ్​అధికారులు చెబుతున్నారు. కరోనా సమయంలో లాక్​డౌన్​విధించినపుడు హైదరాబాద్​శివార్లలో వందల మంది ఆల్ఫాజోలెం కలిపిన కల్లు దొరకక విచిత్రంగా ప్రవర్తించటంతో పాటు కొందరు ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలను గుర్తు చేశారు. కొన్ని రోజుల ముందు మహబూబ్​నగర్​జిల్లాలో కూడా కొందరు కల్తీ కల్లు కాటుకు బలైన విషయం తెలిసిందే.

సిండికేట్​కు పొలిటికల్​ అండ..

అధికారులు చెబుతున్న ప్రకారం కల్తీ కల్లు సిండికేట్‌కు పొలిటికల్​అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఈ దందా చేస్తున్న వారు సిండికేట్‌గా ఏర్పడి అధికారంలోకి ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులను తమ వైపు తిప్పుకుంటారు. అందుకు నిదర్శనంగా మహబూబ్‌నగర్ ఉదంతమే ఉదాహరణ. కల్తీ కల్లు తాగి కొందరు చనిపోతే అప్పట్లో ఎక్సైజ్​శాఖ మంత్రిగా ఉన్న శ్రీనివాస్‌గౌడ్​అనారోగ్య కారణాలతో మాత్రమే వాళ్లు మరణించినట్లగా స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయితే, ఈ అంశం వివాదాస్పదంగా మారడంతో ఎక్సైజ్​అధికారులు కొన్ని శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం ఫోరెన్సిక్​ల్యాబ్‌కు పంపించారు. అయితే, ప్రభుత్వం మారిపోయింది తప్పితే పరీక్షల్లో ఏం తేలిందనే విషయం ఇప్పటికీ వెల్లడి కాలేదు.


Next Story

Most Viewed