మసీదును కూల్చేసి మందిరాన్ని నిర్మించడాన్ని వ్యతిరేకిస్తున్నాం : ఉదయనిధి

by Dishanational4 |
మసీదును కూల్చేసి మందిరాన్ని నిర్మించడాన్ని వ్యతిరేకిస్తున్నాం : ఉదయనిధి
X

దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్య రామమందిరానికి తమ పార్టీ వ్యతిరేకం కాదని.. మసీదును కూల్చేసి మందిరాన్ని నిర్మించడాన్నే తాము వ్యతిరేకిస్తున్నామని డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. డీఎంకే ఏ మతానికీ.. ఏ విశ్వాసానికీ వ్యతిరేకం కాదని పార్టీ దిగ్గజ దివంగత నేత ఎం.కరుణానిధి చెప్పేవారని గుర్తుచేశారు. ఉదయనిధి స్టాలిన్ గురువారం చెన్నైలో విలేకరులతో మాట్లాడారు. ఈసందర్భంగా 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనను ఆయన ప్రస్తావించారు. ‘‘అయోధ్యలో గుడి కడితే మాకు ఇబ్బంది లేదు. ఆధ్యాత్మికతపై రాజకీయాలు చేయకూడదని మా పార్టీ కోశాధికారి (టీఆర్‌ బాలు) కూడా ఇప్పటికే చెప్పారు’’ అని తెలిపారు. నీట్ పరీక్షకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం చేస్తున్న ఉద్యమంలో భాగంగా 50 లక్షల సంతకాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా 85 లక్షల సంతకాలు వచ్చాయని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. జనవరి 21న సేలంలో జరిగే డీఎంకే యువజన విభాగం సదస్సులో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు ఈ సంతకాలను అందజేస్తామన్నారు. ఆన్‌లైన్‌, పోస్ట్‌ల ద్వారా స్వీకరించిన ఈ సంతకాలను న్యూఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతికి కూడా అందజేస్తామని ఆయన తెలిపారు.



Next Story

Most Viewed