నయనతారపై కేసు.. ‘అన్నపూరణి’లో శ్రీరాముణ్ని అగౌరవపరిచారంటూ ఫిర్యాదు

by Dishanational4 |
నయనతారపై కేసు.. ‘అన్నపూరణి’లో శ్రీరాముణ్ని అగౌరవపరిచారంటూ ఫిర్యాదు
X

దిశ, నేషనల్ బ్యూరో : హీరోయిన్ నయనతార నటించిన ‘అన్నపూరణి’ సినిమా వివాదాల వలయంలో చిక్కుకుంది. ‘‘ఈ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. ఇందులో రాముడిని అగౌరవపరిచారు. సినిమా ద్వారా లవ్ జిహాద్‌ను ప్రచారం చేశారు’’ అని ఆరోపిస్తూ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో హిందూ సేవా పరిషత్ అనే సంస్థ కేసు వేసింది. సమాజంలోని పలు వర్గాల మధ్య మతపరమైన శత్రుత్వాన్ని పెంచేలా ఈ సినిమా ఉందని ఫిర్యాదులో పేర్కొంది. దీని ఆధారంగా జబల్‌పూర్‌ నగరంలోని ఓమ్టి ప్రాంతానికి చెందిన పోలీసులు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్‌లో నటి నయనతార, సినిమా దర్శకుడు నీలేష్ కృష్ణ, నిర్మాతలు జతిన్ సేథీ, ఆర్ రవీంద్రన్, నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్‌ సహా ఏడుగురి పేర్లను నిందితులుగా చేర్చారు. డిసెంబరు 1న థియేటర్లలో విడుదలైన ‘అన్నపూరణి’ మూవీ.. డిసెంబర్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతోంది. అయితే అనేక ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి అర్ధంతరంగా తీసేశారు. నయనతార, ఈ మూవీకి సంబంధించిన పలువురిపై బజరంగ్ దళ్, హిందూ ఐటీ సెల్ సంస్థలు ముంబైలోనూ పోలీసులకు రెండు ఫిర్యాదులు చేశాయి.

Next Story

Most Viewed