ఇప్పటికైనా అయోధ్య వివాదానికి ముగింపు పలకాలి: ప్రాణ ప్రతిష్ట వేళ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

by Dishanational2 |
ఇప్పటికైనా అయోధ్య వివాదానికి ముగింపు పలకాలి: ప్రాణ ప్రతిష్ట వేళ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: దశాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య వివాదానికి ఇప్పటికైనా ముగింపు పలకాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. ‘అయోధ్య అంటే యుద్ధం లేని నగరం, సంఘర్షణ లేని ప్రదేశం. కాబట్టి సమాజంలోని మేథావులు ఈ వివాదం పూర్తిగా ముగిసేలా చూడాలి’ అని కోరారు. ‘ప్రారంభంలో దేశ దండయాత్రల లక్ష్యం దోచుకోవడం. కొన్ని సార్లు వలస రాజ్యం కోసం కూడా జరిగాయి. కానీ ఇస్లాం పేరుతో పాశ్చాత్య దేశాల నుంచి జరుగుతున్న దాడులు మాత్రం సమాజాన్ని పూర్తిగా విధ్వంసం చేశాయి. అయోధ్యలోని శ్రీరామ మందిరాన్ని కూల్చివేయడం కూడా అదే ఉద్దేశంతో జరిగింది’ అని పేర్కొన్నారు. ‘శ్రీరాముడు మెజారిటీ సమాజం ఆరాధించే దేవుడు. ఆయన జీవితాన్ని ఇప్పటికీ అనేక మంది ఆదర్శంగా తీసుకుంటారు. అందుకే ఇప్పుడు ఈ వివాదంపై అనుకూలంగా, వ్యతిరేకంగా తలెత్తిన ఘర్షణకు ముగింపు పలకాలి’ అని కోరారు. కాగా, రామమందిర ఉద్యమంలో భాగంగా1992 డిసెంబర్ 6న పెద్ద సంఖ్యలో హిందూ కార్యకర్తలు బాబ్రీ మసీదును కూల్చడంతో అయోధ్యలో ఆందోళనలు పెరిగిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed