24గంటల్లో 25వేల కేసులు నమోదు

by  |
24గంటల్లో 25వేల కేసులు నమోదు
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. గురువారం ఉదయం కేంద్ర ఆరోగ్యశాఖ బులెటిన్ వెల్లడించే సరికి గడిచిన 24 గంటల్లో దేశంలో 24,879 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,67,296కు చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. సాయంత్రానికి వివిధ రాష్ట్రాల బులెటిన్‌లు వెల్లడవడంతో ఒక్క రోజులో నమోదైన కొత్త కేసుల సంఖ్య 25వేల మార్కు దాటింది. వైరస్ బారిన పడి దేశంలో ఒక్కరోజే 487 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 21,129కి చేరింది. కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 4,76,378 కోలుకోగా ప్రస్తుతం 2,69,789 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనా పేషెంట్‌ల రికవరీ రేటు 62శాతంగా ఉంది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో కరోనా వ్యాప్తి రోజురోజుకు తీవ్రమవుతోంది. ఢిల్లీలో ఒక్కరోజే 2,187 కొత్త కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 1,07,051కు చేరింది. ఇక్కడ కొత్తగా 45కరోనా మరణాలు నమోదవడంతో మొత్తం 3,258 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. మహారాష్ట్రలో ఒక్కరోజులోనే 6,875 పాజిటివ్ కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 2,30,599కి వెళ్లింది. రాష్ట్రంలో 24 గంటల్లో వైరస్ బారినపడి 219 చనిపోగా మొత్తం మరణాలు 9,667కు చేరాయి. తమిళనాడులో 24గంటల్లో 4,231 పాజిటివ్‌లు నమోదై మొత్తం కేసుల సంఖ్య 1,26,581కి చేరింది. ఇక్కడ కొత్తగా కరోనాతో 65మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 1,765కు చేరింది. గుజరాత్‌లో ఇప్పటివరకు ఉన్న 39,280 కేసులకు గాను 2,010 మంది మరణించడం రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తోంది. కేరళలో కొత్తగా 339 కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 6,534కు చేరింది. ఏపీలో గడిచిన 24 గంటల్లో 1555 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 23,814కు చేరింది. ఒక్కరోజే ఏపీలో కరోనాతో 13 మంది చనిపోయారు. ఇప్పటివరకు వైరస్ సోకి 277 మంది మృత్యువాత పడ్డారు.



Next Story

Most Viewed