కరోనాతో ఒక్కరోజే 77 మంది మృతి

by  |
కరోనాతో ఒక్కరోజే 77 మంది మృతి
X

– ఇప్పటివరకు ఇదే గరిష్టం
– 35 వేలు దాటిన మొత్తం కేసులు

దిశ, న్యూస్ బ్యూరో : దేశంలో కరోనా వైరస్ ప్రవేశించింది మొదలు ఇప్పటివరకు ఎన్నడూ లేనంత ఎక్కువ సంఖ్యలో 77 మంది ఒకేరోజు మృతి చెందారు. గురువారమే రికార్డు స్థాయిలో 71 మంది చనిపోగా, ఇప్పుడు ఆ రికార్డును అధిగమిస్తూ 77 మంది చనిపోవడం గమనార్హం. రికవరీ కేసులు పెరుగుతున్నాయని, ‘డబ్లింగ్’ అయ్యే సమయం పెరుగుతూ ఉందని కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ సంతృప్తి వ్యక్తం చేస్తున్నా.. మృతుల సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా మరణించిన 77 మందిలో ఎక్కువగా మహారాష్ట్ర నుంచి 27 మంది, గుజరాత్‌లో 17 మంది, పశ్చిమ బెంగాల్‌లో 11 మంది, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ఏడుగురు చొప్పున ఉన్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా కారణంగా దేశవ్యాప్తంగా చనిపోయినవారి సంఖ్య 1152కు చేరుకోగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 35,365కు చేరుకుంది. ఇప్పటివరకు 9064 మంది డిశ్చార్జి కావడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ పాజిటివ్ పేషెంట్ల సంఖ్య 25,148గా నమోదైంది.

దేశవ్యాప్తంగా కరోనాతో మృతిచెందినవారిలో ఎక్కువగా మహారాష్ట్రలోనే 459 మంది ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్ (214), మధ్యప్రదేశ్ (137), ఢిల్లీ (59) రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణలో కొత్తగా ఆరు కేసులు మాత్రమే నమోదుకాగా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కొత్తగా 60 కేసులు నమోదవడంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 1463కు చేరుకుంది. ఇందులో 33 మంది చనిపోగా 403 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 11 వేల మార్కు దాటింది. ఒక్కరోజే గరిష్ట స్థాయిలో వెయ్యి కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం 1755 కేసులు నమోదైతే ఇందులో 1008 ఒక్క మహారాష్ట్రలోనే ఉండటం గమనార్హం.

భారత్ :
మొత్తం కేసులు : 35,365
మృతులు : 1152
రికవరీ : 9064

తెలంగాణ :
మొత్తం కేసులు : 1044
మృతులు : 28
రికవరీ : 464

ఆంధ్రప్రదేశ్ :
మొత్తం కేసులు : 1463
మృతులు : 33
రికవరీ : 403

Tags : Corona, 77 Deaths, Active cases, Maharshtra, telangana

Next Story

Most Viewed