48 గంటల్లో 5 వేల మొక్కలు నాటిన సైక్లిస్ట్ బ్రదర్స్..

by  |
48 గంటల్లో 5 వేల మొక్కలు నాటిన సైక్లిస్ట్ బ్రదర్స్..
X

దిశ, ఫీచర్స్ : కరోనా ఫస్ట్ లాక్‌డౌన్‌లో సరదాగా మొక్కలు నాటినా.. ఏడాది తర్వాత సీరియస్ హాబీగా ఎంచుకున్న తమిళనాడు, వెంబకొట్టైలోని కల్లమనాయకర్‌ పట్టికి చెందిన అరుణ్ (25), శ్రీకాంత్(22) సోదరులు జనవరి 21 నుంచి 26 మధ్య 48 గంటల సమయంలో 5,000 మొక్కలు నాటి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం వారి జిల్లా అంతటినీ ఆకుపచ్చమయంగా మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నారు.

పాలిమర్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్ అయిన శ్రీకాంత్ జాతీయస్థాయి సైక్లిస్ట్ కూడా. 2019 అక్టోబర్‌లో కన్యాకుమారి నుంచి ముంబై వరకు 2,000 కి.మీ దూరం ‘సైక్లింగ్ ఫర్ రీసైక్లింగ్’ ట్రిప్‌లో సోదరుడు అరుణ్ (సాఫ్ట్‌వేర్ ఇంజినీర్)తో కలిసి పాల్గొన్నాడు. 11 రోజుల్లో ఈ దూరాన్ని కవర్ చేసిన బ్రదర్స్.. ఈ ట్రిప్‌లో భాగంగా ప్లాస్టిక్‌ను సరైనవిధంగా పారేయడంతో పాటు 25 సంస్థల్లో రీసైకిల్ చేసే పద్ధతులపై అవగాహన శిబిరాలు నిర్వహించారు. ఈ మేరకు ‘ఎఫిషియస్ సైక్లిస్టులు’గా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ప్రశంసా పత్రాన్ని కూడా అందుకున్నారు. కాగా ఇటీవలే వారు ‘గరిష్టంగా మొక్కలు నాటేందుకు అతిపెద్ద సైక్లింగ్ క్యాంపెయిన్’ చేపట్టగా దీనిపై ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు.

ప్రాజెక్ట్‌లో భాగంగా సైక్లింగ్, మొక్కల పెంపకాన్ని కంబైన్డ్‌గా చేపట్టి జనవరి 21 నుంచి 26 మధ్య 48 గంటల్లో 30 రకాలకు చెందిన 5,000 మొక్కలను నాటినట్టు బ్రదర్స్‌లో ఒకరైన అరుణ్ వెల్లడించాడు. అందుకోసం రోజుకు ఎనిమిది గంటలు పనిచేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో జిల్లాలోని దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఆసుపత్రుల దగ్గర మొక్కలు నాటారు. గుంతల తవ్వకం కోసం స్థానిక యువకులతో పాటు MGNREGS కార్మికుల మద్దతు కోరారు. స్థానికులతో సమన్వయంతో నాటిన మొక్కలను అప్పుడప్పుడు సందర్శిస్తుండటంతో వాటిలో 90 శాతం మొక్కలు చెట్లుగా పెరిగాయి.

ఈ ప్రాజెక్ట్ కోసం ప్రైవేట్ స్పాన్సర్ల నుండి నిధులు సేకరించడంతో పాటు సొంత డబ్బును కూడా వినియోగించిన బ్రదర్స్.. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణ మార్పులపై అవగాహన కల్పించడానికి ‘ఎన్-ఇండియా’ అనే లాభాపేక్షలేని సంస్థను కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఇదే స్ఫూర్తితో తమ సేవలను ఇతర జిల్లాలకు వ్యాపింపచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.



Next Story