పండుగ రోజు విషాదం.. ఒకే ఇంట్లో ఐదుగురు మృతి

by  |
పండుగ రోజు విషాదం.. ఒకే ఇంట్లో ఐదుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: విజయదశమి ఆ ఇంట్లో తీవ్ర విషాదం నింపింది. పండుగ కోసం పట్నం నుంచి పల్లెకు వచ్చిన కుటుంబ సభ్యులు బతుకమ్మ కార్యక్రమం అనంతరం రాత్రి భోజనం చేసి పడుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటి పై కప్పు ఒక్కసారిగా కుప్పకూలడంతో ఐదుగురు మహిళలు నిద్రలోనే అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఈ విషాదకరమైన ఘటన వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారంలో ఆదివారం తెల్లవారు జామున వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకివెళితే.. రాష్ట్రంలో మొన్న కురిసిన భారీ వర్షాలకు మణెమ్మ ఇల్లు మొత్తం దెబ్బతిన్నది. చాలా ఏండ్ల కిందటది కావడంతో ఈ దారుణం జరిగి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. పండుగ కోసం వచ్చిన కుటుంబసభ్యులు తొమ్మిది మంది రాత్రి భోజనం చేసి ఒకే గదిలో పడుకున్నారు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి ఒక్కసారిగా ఇంటి పై కప్పుకూలడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు మృతి చెందగా, మరోకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో అత్త మణెమ్మ, కోడళ్లు సుప్రజ, ఉమాదేవి, మనవరాళ్లు వైష్ణవి, పింకి (అక్షయ)గా గుర్తించారు.

మణెమ్మ కొడుకు కుమారస్వామికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరోఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరాతీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Next Story