బుద్ధారం మృతుల కుటుంబానికి మంత్రి హామీ

by  |
బుద్ధారం మృతుల కుటుంబానికి మంత్రి హామీ
X

దిశ, వెబ్ డెస్క్ : మహబూబ్ నగర్ జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంటి మిద్దె కూలిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన నర్సింహ ఏడాది క్రితం చనిపోయాడు. ఆయన సంవత్సరికం సందర్భంగా కుమారులు, కోడళ్లు, మనుమరాళ్లు గ్రామానికొచ్చారు. కార్యక్రమం ముగిసిన అనంతరం రాత్రి 11మంది ఒకే గదిలో నిద్రపోయారు.

ఇటీవల కురిసిన వర్షాలకు నానిపోయి ఉన్న మట్టి మిద్దె ఒక్కసారిగా కుప్పకూలి గదిలో నిద్రపోతున్న వారిపై పడింది. ఈ ఘటనలో ఇంటి యజమాని మణెమ్మ, ఆమె కోడళ్లు సుప్రజ, ఉమాదేవి, మనుమరాళ్లు అశ్విని, పింకి మృత్యువాత పడ్డారు. మణెమ్మ కుమారుడు కుమార్ తీవ్రంగా గాయపడగా… అతనిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. శిథిలాల్లో చిక్కుకున్న మృతదేహాలను పోలీసులు గ్రామస్థల సహకారంతో వెలికి తీశారు.

కాగా ఈ ఘటన గురించి తెలుసుకున్న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుద్దారం ఘటన దురదృష్టకరమని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed