నవంబర్ 1 నుంచి జరగబోయే 5 భారీ మార్పులు ఇవే!

by  |
big changes
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది ముగింపుకొచ్చేసింది. ప్రస్తుతం నవంబర్ 1వ తేదీ నుంచి అనేక రంగాల్లో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రతి నెల మాదిరిగానే ఈ నెల కూడా కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. గ్యాస్ ధరల దగ్గరి నుంచి బ్యాంకుల నిబంధనల వరకు అనేక మార్పులు జరగనున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

పాత వెర్షన్లలో వాట్సాప్ ఉండదు..

నవంబర్ 1వ తేదీ నుంచి వాట్సాప్ సంస్థ ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లకు చెందిన పాత వెర్షన్‌లలలో సేవలను ఆపేస్తున్నట్టు వాట్సాప్ స్పష్టం చేసింది. వీటిలో ఆండ్రాయిడ్ 4.0.3, ఐఓఎస్ 9 సహా వాటి ముందు జనరేషన్ ఓఎస్‌లతో పనిచేస్తున్న ఆండ్రాయిడ్, యాపిల్, ఫీచర్ ఫోన్‌లలో వాట్సాప్ సపోర్ట్ చేయదని కంపెనీ వెల్లడించింది.

గ్యాస్ ధర మోత..

ప్రతి నెలా సమీక్షించే గ్యాస్ ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎల్‌పీజీ గ్యాస్ ధరలు ఇటీవల మండుతూనే ఉన్నాయి. ఇప్పటికే రూ. వెయ్యి చేరుకున్న గ్యాస్ ధరలతో సామాన్యులకు గుదిబండగా మారాయి. ప్రతి నెలా ఆయిల్ కంపెనీలు 15 రోజులకొకసారి ఎల్‌పీజీ ధరలను సవరిస్తున్నాయి. నవంబర్ 1 నుంచి కూడా మళ్లీ గ్యాస్ ధరలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం వల్ల ఆ నష్టాలను అధిగమించేందుకు గ్యాస్ ధరలు పెంచవచ్చని, ప్రభుత్వం అనుమతి రాగానే వినియోగదారులపై భారం మోపేందుకు ఆయిల్ కంపెనీలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా ఛార్జీలు..

ఈ నెల నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) నగదు డిపాజిట్, విత్‌డ్రా చేసేందుకు కొత్త ఛార్జీలను విధించనుంది. నిజానికి పరిమితి కంటే ఎక్కువ బ్యాంకింగ్ సేవలను ఉపయోగిస్తే ఫీజు చెల్లించాలని బీఓబీ చెబుతోంది. ఖాతాదారులెవరైనా నెలలో మూడు కంటే ఎక్కువసార్లు డిపాజిట్ చేస్తే రూ. 40 వసూలు చేయనుంది. అలాగే, నెలలో మూడు కంటే ఎక్కువసార్లు ఏటీఎం ద్వారా నగదు విత్​డ్రా చేస్తే రూ. 100 ఛార్జీ విధించనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. జన్‌ధన్ ఖాతా ఉన్నవారికి నగదు డిపాజిట్ చేసేందుకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయదు. కానీ విత్‌డ్రాకు మాత్రం రూ. 100 చెల్లించాలంటోంది.

పింఛనుదారులకు ఊరట..

దేశీయంగా దిగ్గజ ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ పింఛనుదారులకు నవంబర్ 1 నుంచి ఊరట కల్పించనుంది. లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి పెన్షనర్లు బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదని, దానికి బదులుగా వీడియో కాల్ ద్వారా సంప్రదించే సదుపాయం కల్పిస్తున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది. ఈ నిర్ణయం పెద్దలకు అతిపెద్ద ఊరట.

పండుగ సీజన్-ప్రత్యేక రైళ్లు..

నవంబర్‌లో దీపావళి సహా ఇతర పండుగలను దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఇవి నవంబర్ 1 నుంచి ప్రారంభం అవనున్నాయి. మరికొన్ని నెలలో వివిధ తేదీలల్లో ప్రారంభం కానున్నట్టు భారతీయ రైల్వే తెలిపింది .అంతేకాకుండా నవంబర్ 1 నుంచి రైళ్ల టైమ్ టేబుల్‌ను మారనున్నారు. దీని ప్రకారం.. 13 వేల ప్యాసింజర్ రైళ్లు, 7 వేల గూడ్స్ రైళ్ల వేళలు మారనున్నాయి. అలాగే, సుమారు 30 రాజధాని రైళ్ల వేళల్లో మార్పులు జరగనున్నాయి.

‘రొమాంటిక్’ హీరోయిన్‌పై RGV హాట్ కామెంట్స్


Next Story

Most Viewed