చైనా వస్తువులకు దూరంగా దేశీయ వినియోగదారులు

by  |
చైనా వస్తువులకు దూరంగా దేశీయ వినియోగదారులు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ వినియోగదారుల్లో గత ఏడాది కాలంగా చైనా ఉత్పత్తులను కొనడానికి ఇష్టపడటం లేదని తేలింది. ఏడాది క్రితం గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘటన తర్వాత నుంచి 43 శాతం మంది భారతీయులు చైనాలో తయారైన వస్తువులను కొనుగోలు చేయలేదని లోకల్‌సర్కిల్స్ సర్వే స్పష్టం చేసింది. ఇదే సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో మేడ్ ఇన్ చైనా ఉత్పత్తులను కొన్నవారిలో 60 శాతం మంది ఒకటో, రెండో వస్తువులను మాత్రమే కొన్నట్టు సర్వే వెల్లడించింది. 2020లో జరిగిన గల్వాన్ ఘటన అనంతరం చైనా వస్తువులను బహిష్కరించాలనే నిరసన దేశవ్యాప్తంగా పెరిగింది. ఈ క్రమంలో కేంద్రం సైతం టిక్‌టాక్ లాంటి చైనాకు చెందిన వందల యాప్‌లను నిషేధించింది. దీంతో నెమ్మదిగా చైనా ఉత్పత్తులపై అయిష్టతకు డిమాండ్ పెరిగింది.

గత సంవత్సరం పండుగ సీజన్‌ సమయంలో లోకల్‌సర్కిల్స్ సేకరించిన వివరాల ప్రకారం.. ఆ పండుగ సీజన్ సమయంలో 71 శాతం మంది దేశీయ వినియోగదారులు చైనా వస్తువులను కొనలేదని చెప్పారు. తాజా నివేదిక ప్రకారం.. దేశీయంగా చైనా వస్తువులు, ఉత్పత్తులకు డిమాండ్ అధికంగా ఉండటానికి వాటి ఖరీదు తక్కువగా ఉండటమే కారణమని 70 శాతం మంది వినియోగదారులు చెప్పారు. కొన్ని వస్తువులు నాణ్యతతో లభిస్తుండటం కూడా కారణమని కొందరు అభిప్రాయపడ్డారు. సాధారణంగా ఎలక్ట్రిక్ యంత్రాలు, ఔషధాలు, గృహోపకరణాలు, మందులతో సహా అనేక ఉత్పత్తులకు సంబంధించి చైనాపై మనం ఆధారపడుతున్నాం. ముఖ్యంగా భారత దిగుమతుల్లో ఇంటర్మీడియట్ వస్తువుల వాటా 12 శాతం, మూలధన వస్తువుల్లో 30 శాతం, వినియోగానికి సిద్ధంగా ఉన్న వాటిలో 26 శాతం వాటా చైనావే ఉన్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 281 జిల్లాల నుంచి వివరాలను సేకరించినట్టు లోకల్‌సర్కిల్స్ పేర్కొంది.



Next Story

Most Viewed