విషాదం.. తెలంగాణలో 426 మంది స్టూడెంట్స్ సూసైడ్

by  |
విషాదం.. తెలంగాణలో 426 మంది స్టూడెంట్స్ సూసైడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి పకడ్బందీ, శాస్త్రీయ చర్యలు తీసుకోకపోవడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల ఆత్మహత్యల పై నివేదిక ఇవ్వాల్సిందిగా గతేడాది డిసెంబరులోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులని ఆదేశించినా నివేదిక ఇంకా అందలేదని, ఆరు వారాల్లోనే సమర్పించాలని లేనిపక్షంలో ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993లోని సెక్షన్ 13 ప్రకారం ప్రధాన కార్యదర్శులు స్వయంగా విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని ఎన్‌హెచ్‌ఆర్‌సీ శనివారం జారీ చేసిన నోటీసుల్లో స్పష్టం చేసింది.

విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి తీసుకున్న చర్యలపై ఆరు వారాల్లోగా సమగ్ర నివేదికను అందించాలని స్పష్టం చేసింది. జాతీయ క్రైం రికార్డుల ప్రకారం 2019-20లో తెలంగాణలో 426 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇందులో 22 మంది ఒక్క వారం వ్యవధిలోనే సూసైడ్ చేసుకున్నారని ఎన్‌హెచ్‌ఆర్‌సీ నొక్కిచెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో అదే కాలంలో 383 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారని పేర్కొన్నది. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు సరిపోవని వ్యాఖ్యానించింది.

తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ న్యాయవాది శ్రావణ్ కుమార్ ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేయడంలో పలు దఫాలుగా విచారణ జరిపి తాజాగా ఈ ఆదేశాలను జారీచేసింది. ఉన్నత చదువులు, ఉత్తమ విద్యా సంస్థ, ఎక్కువ ఫీజులు, సంతృప్తికరమైన జీవన ప్రమాణాలు.. ఇలాంటి పలు కారణాలతో చాలా ప్రైవేటు విద్యా సంస్థలు నైతిక విలువలకు తిలోదకాలిస్తున్నాయని, జీవితానికి సంబంధించిన ప్రాథమిక అవసరాలను మర్చిపోతున్నాయని కమిషన్ తన తాజా ఆదేశాల్లో పేర్కొన్నది.

Next Story

Most Viewed