‘కోట’ దాటి స్వరాష్ట్రం చేరిన విద్యార్థులు

by  |
‘కోట’ దాటి స్వరాష్ట్రం చేరిన విద్యార్థులు
X

గువహతి: ఐఐటీ, నీట్ కోచింగ్‌లకెళ్లి లాక్‌డౌన్ అమలుతో రాజస్థాన్‌లోని కోట పట్టణంలో చిక్కుకున్న అస్సాం విద్యార్థులు ఎట్టకేళకు స్వరాష్ట్రానికి చేరుకున్నారు. లాక్‌డౌన్ అమలుతో అక్కడే చిక్కుకుని తీవ్ర అవస్థలు పడుతున్నామనీ, తమను స్వరాష్ట్రానికి తీసుకెళ్లాలని సామాజిక మాధ్యమాల ద్వారా విద్యార్థులు వేడుకోగా, స్పందించిన అస్సాం ప్రభుత్వం వారిని తీసుకురావడానికి నిర్ణయించింది. ఈ మేరకు కోట నుంచి 391 మంది విద్యార్థులతో గురువారం బస్సు బయలుదేరగా, సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు అస్సాంలోని గువహతికి చేరుకుంది.

అనంతరం వారిని క్వారంటైన్ సెంటర్‌లోకి తరలించినట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హిమంత విశ్వశర్మ వెల్లడించారు. 14రోజుల అనంతరం ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించకపోతే స్వగ్రామాలకు పంపుతామని స్పష్టం చేశారు. సుమారు 2వేల కిలోమీటర్ల సుదూర ప్రయాణం చేసి స్వరాష్ట్రానికి చేరుకున్న విద్యార్థుల మొహాలు చిరునవ్వుతో వెలిగిపోతున్నాయని తెలిపారు. కాగా, కోటలో ప్రఖ్యాత కోచింగ్ సెంటర్లుండటంతో దేశం నలుమూలల నుంచి అనేకమంది విద్యార్థులు అక్కడకు వెళ్తుంటారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కూడా వెళ్లి చిక్కుకున్నారు. కావున తమనూ స్వరాష్ట్రాలకు తీసుకెళ్లాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను కోరుతున్నారు.

Tags: rajasthan, kota, assam, guwahathi, lockdown, students reached to assam, corona,


Next Story

Most Viewed