38 మంది కుటుంబ సభ్యుల అల్టిమేటం.. మా భూములిస్తారా.. చావమంటారా..?

by  |
38 మంది కుటుంబ సభ్యుల అల్టిమేటం.. మా భూములిస్తారా.. చావమంటారా..?
X

దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు మండలంలోని ఉడతాని గుంపు ప్రాంతంలో సర్వే నెంబర్ 133/34/1 గల భూములను పెనుబల్లి రాము అనే వ్యక్తి కబ్జా చేశాడని మండలానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 38 మంది సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం వీరంతా ‘దిశ’ను సంప్రదించారు. మండలంలోని బాపనకుంట, మల్లెపల్లి, రాజుపేట ప్రాంతాలు ‘సింగరేణి’ కిందపోతుందని ఈ క్రమంలోనే పిల్లల భవిష్యత్ కోసం ఉడతాని గుంపులో వీఆర్ఓ ఆదినారాయణ భార్య వాడే వనిత దగ్గర ఈ భూములను కొనుగోలు చేశామని బాధిత కుటుంబంలోని 38 మంది సభ్యులు తెలిపారు. రెక్కలు ముక్కలు చేసుకుని కూలి నాలి చేసి, భార్య మెడలలో పుస్తెలు అమ్మి 38 ప్లాట్లు కొనుగోలు చేశామని బాధితులు పేర్కొన్నారు.

అయితే, పెనుబల్లి రాము అనే వ్యక్తి ఈ భూములకు నకిలీ డాకుమెంట్స్ సృష్టించి మా భూములను కబ్జా చేశారని వాపోయారు. మా భూములు కబ్జా చేసి ఫెన్సింగ్ వేస్తుంటే ఇవి తమ భూములు అని ప్రశ్నించగా.. మీవి కావు.. నావి అంటూ దాడికి దిగాడని బాధితులు వాపోయారు. నా భూముల్లో అడుగులు పెడితే తలలు పగిలిపోతాయని బెదిరించాడని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మా భూముల్లో ఓ పార్టీ కార్యాలయం కోసం భవనం నిర్మిస్తే దానిని కూల్చివేశారని బాధితులు వాపోయారు. ఆ భవనానికి ఇంటి పన్ను కూడా ఉందని వెల్లడించారు. కట్టిన భవనాన్ని ఎలా కూల్చి వేస్తారని బాధితులు పెనుబల్లి రామును ప్రశ్నించగా, ఇది నా భూమి, నా ఇష్టం.. మీకు దిక్కు ఉన్నచోట చెప్పుకోపొండి అంటున్నాడని వారు తెలిపారు. ప్రతీ ఏడాది వాడే వనిత పేరు మీద రైతుబంధు పథకం వస్తుందని, నేటికి కూడా వనిత పేరు మీదనే భూములు ఉన్నాయని బాధితులు తెలిపారు.

వాడే వనిత పేరు మీద ఉన్న భూమి మీకు ఎలా చెందుతుందని పెనుబల్లి రాము నిలదీశారన్నారు. ఈ విషయంపై న్యాయం కోసం స్థానిక పోలీస్ అధికారి ఏఎస్పీ దగ్గరకు వెళ్లి కాగితాలను చూపిస్తే.. ఆయన వాటిని పరిశీలించి ఈ భూమి మీదే.. మీరు రేకులు వేసుకోండి.. ఖాళీగా ఉంచకండని మాకు తెలిపారన్నారు. మరల మా భూముల్లోకి వెళ్ళితే పెనుబల్లి రాము దాడికి దిగాడన్నారు. ఇదే విషయాన్ని స్థానిక సీఐ దృష్టికి తీసుకెళ్లగా ఆ భూమి రాముకు చెందినదని.. మీరు అటుగా వెళ్ళకండని అని చెప్పినట్టు వివరించారు.అదేంటి సార్.. అని అడుగుతే స్థానిక తహశీల్దార్ దగ్గరకు వెళ్ళండి. మీ భూమి ఎక్కడో చూపిస్తారని చెప్పారని బాధను వ్యక్తం చేశారు. చివరకు తహశీల్దార్ దగ్గరకు వెళ్ళితే ఈ భూములు కోయ్యోలు కొనాలి లేదా దొరలు కొనాలి. మీరెందుకు కొన్నారని వెటకారం చేసినట్టు గుర్తుచేశారు. మీకు అంతలా ఇబ్బంది ఉంటే అప్లికేషన్ ఇవ్వండి. సర్వే చేసి చూస్తామని ఎమ్మార్వో చెప్పినట్టు వెల్లడించారు.

ఈ క్రమంలోనే మా భూమి వద్దకు వెళ్లితే పెనుబల్లి రాము మమ్మల్ని చంపుతానని బెదిరిస్తున్నాడని బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. పెనుబల్లి రాము వెనుక టీఆర్ఎస్ నాయకులు జడ్పీటీసీ పొశం నరసింహారావు, ఉడతాని భాస్కర్, ఉడతాని రవి ఉన్నారని తెలిపారు. తమకు న్యాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లగా రెండ్రోజుల తర్వాత డిసైడ్ చేస్తానని అన్నట్టు చెప్పారు. ఆ టైంలో ఎమ్మెల్యే పక్కనే పొశం నరసింహారావు ఉన్నారని.. ఈ భూమి వీళ్ళది కాదు. ఇది ఖాళీగా ఉందని ఎమ్మెల్యేకు చెప్పారని బాధితులు వాపోయారు. తమకు ఎక్కడికి వెళ్లినా న్యాయం జరగడం లేదని, కనీసం ఉండనీకి ఇల్లులు కూడా లేవని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా భూములు మాకు దక్కకపోతే పురుగుల మందు లేదా పెట్రోల్ పోసుకుని మా భూముల్లోనే చనిపోతామంటూ 38 కుటుంబ సభ్యుల హెచ్చరించారు.

Next Story

Most Viewed