2 ఏళ్లల్లో 36 వేల ఫిర్యాదులు…జూమ్ ద్వారా అవగాహన

by  |
2 ఏళ్లల్లో 36 వేల ఫిర్యాదులు…జూమ్ ద్వారా అవగాహన
X

దిశ, క్రైమ్ బ్యూరో : రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలతో పోలీస్ శాఖ తలలు పట్టుకుంటుంది. ముఖ్యంగా సైబర్ నేరాల కేసులు నమోదు హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ పరిధిలోనే అత్యధికంగా నమోదే కావడంతో ఆందోళన కలిగించే అంశంగా అధికారులు భావిస్తున్నారు. గత రెండేళ్ల కాలంలో హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ పరిధిలో దాదాపు 36 వేల సైబర్ నేరాల ఫిర్యాదులు అందినట్టుగా అధికారులు చెబుతున్నారు. ఈ కేసులు 2019 ఏడాదిలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3600, రాచకొండలో 3021, సైబరాబాద్ లో 8 వేలు కేసులు నమోదు కాగా, 2020లో హైదరాబాద్ లో 6027, రాచకొండలో 5860, సైబరాబాద్ లో 8900 కేసులు నమోదు అయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు హైదరాబాద్ లో 2600, రాచకొండలో 2 వేలు, సైబరాబాద్ లో 3600లు కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులలో అత్యధికంగా ఫేస్ బుక్, ఓఎల్‌ఎక్స్ తదితర ఆన్ లైన్ మాధ్యమాల ద్వారానే మోసాలు జరుగుతున్నాయి. ఈ మోసాలను తమంతట తామే తెలుసుకునేలా సైబర్ నిపుణులతో విద్యార్థినీ, విద్యార్థులకు శిక్షణ అందించి సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేందుకు శనివారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా, ఐజీ సుమతి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన పాల్గొన్నారు.

5 వేల మందికి శిక్షణ..

సమావేశంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా మాట్లాడుతూ కరోనా మహమ్మారి నేపథ్యంలో మహిళలు, పిల్లలుతో సహా అన్ని వర్గాల వారు మొబైల్ ఫోన్ లను అధికంగా ఉపయోగిస్తున్నారని అన్నారు. ఇదే సమయంలో అంతే సంఖ్యలో సైబర్ మోసాలు, నేరాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 33 జిల్లాలను 16 యూనిట్లుగా చేసి ముందుగా ఎంపిక చేసిన 50 పాఠశాలలకు చెందిన వంద మంది విద్యార్థినీ, విద్యార్థులతో పాటు ఒక ఉపాద్యాయిడికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈ శిక్షణ పొందే పిల్లలు పోలీసులకు, ముఖ్యంగా షీ- టీమ్ లకు అంబాసిడర్లుగా ఉంటారని తెలిపారు. పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ దేవసేన మాట్లాడుతూ ప్రస్తుత సాంకేతిక యుగంలో సమాంతర ఇంటర్నెట్ ప్రపంచాన్ని సృష్టించుకున్నామని, ఇదే సమయంలో ఈ టెక్నాలజీ ఆధారిత సైబర్ నేరాల బారిన యువత, మహిళలు పడుతున్నారని పేర్కొన్నారు. సమావేశంలో విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ జి.రమేష్, సైబర్ రంగంలో నిపుణులైన రక్షిత్ తాండాన్, రుత్విక, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed