కమ్యూనిటీలోకి ఒమిక్రాన్… ప్రజల్లో ఆందోళన

by  |
కమ్యూనిటీలోకి ఒమిక్రాన్… ప్రజల్లో ఆందోళన
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఒమిక్రాన్​ కమ్యూనిటీలోకి వెళ్లిపోయింది. సామూహిక వ్యాప్తి జరిగినట్లు స్పష్టంగా అర్థం అవుతున్నది. మంగళవారం నమోదైన '7' కొత్త కేసుల్లో ముగ్గురికి ఎలాంటి ట్రావెల్ ​హిస్టరీ లేదని స్వయంగా మంత్రి హరీశ్​రావు చేసిన ప్రకటన దీనికి బలాన్ని చేకూరుస్తున్నది. ఎలాంటి ట్రావెల్​ హిస్టరీ లేని లోకల్​ వ్యక్తులకు సోకిందంటే ఒమిక్రాన్​ జనాల్లో కలసిపోయినట్లే అర్థం చేసుకోవాలి. దీంతో వైద్యారోగ్యశాఖ సిబ్బందితో పాటు ప్రజల్లోనూ గందరగోళం నెలకొన్నది. కానీ ఈ విషయాన్ని అధికారులు ఆఫ్​ ది రికార్డులో ఒప్పుకున్నా.. అధికారికంగా చెప్పేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో మంత్రి ప్రకటించిన స్టేట్​మెంట్​కు, ఆరోగ్యశాఖ హెల్త్​ బులెటెన్​లో వ్యత్యాసం కనిపించింది. లెక్కలను కన్ఫ్యూజ్​ చేస్తూ హెల్త్​ డిపార్ట్​మెంట్​ అధికారికంగా ప్రకటించిన కరోనా బులెటెన్​లో రిస్క్​ దేశాల నుంచి వచ్చిన నలుగురికి , నాన్​రిస్క్​వాళ్లకు ర్యాండమ్​గా చేసే టెస్టుల్లో మరో ముగ్గురికి ఒమిక్రాన్​ తేలినట్లు స్పష్టం చేశారు. ఎలాంటి ట్రావెల్​ హిస్టరీ లేదని మంత్రి చెప్పగా, వైద్యారోగ్యశాఖ ఆ ముగ్గురిని నాన్​రిస్క్​ జాబితాలో ఎందుకు చూపించిందో అర్ధం కాలేదు. దీంతో మంత్రి చెప్పింది కరెక్టా? బులెటెన్​లో వచ్చింది రైటా? అని పలువురు విమర్శిస్తున్నారు. ట్రావెల్​ హిస్టరీ లేదనప్పుడు అసలు రిస్క్​, నాన్​ రిస్క్​ కంట్రీస్​ ప్రస్తావనే అవసరం లేదు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్​లు ఉండి ఉంటే అదైనా స్పష్టంగా చెప్పాల్సి ఉండే. కానీ ఇవేమీ హెల్త్​ బులెటెన్​లో చెప్పలేదు. అంటే మంత్రి చేసిన ప్రకటనను పరిశీలిస్తే ఒమిక్రాన్​ సామూహిక వ్యాప్తి జరిగిందేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వైద్యసిబ్బందితో పాటు ప్రజల్లోనూ కాస్త గందరగోళం కనిపిస్తున్నది.

ఇన్సాకోజీలో తేలాయి…

కరోనా ప్రారంభమైనప్పటి నుంచి కొత్త వేరియంట్లపై అధ్యయనం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ రీసెర్చ్​సంస్థలు' ఇన్సాకోజి ' పేరిట ప్రతీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్​లలో 5% శాంపిల్స్​ను ర్యాండమ్​గా జీనోమ్​ సీక్వెన్సింగ్​కు పంపిస్తారు. మంత్రి ప్రకటించిన ఆ మూడు ఒమిక్రాన్​ కేసులు ఈ విధానంలోనే నిర్ధారణ అయినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రయివేట్ హాస్పిటల్ లో డయాలసిస్ టెక్నీషియన్ కు, ప్రెగ్నెట్ లేడీ, సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఒమిక్రాన్ సోకింది. అంటే వీరంతా విదేశీయులు, వారి ప్రైమరీ కాంటాక్ట్​లకు సంబంధం లేకుండానే ఉన్నారు. దీని బట్టి ఒమిక్రాన్​కమ్యూనిటీలోకి వెళ్లిపోయిందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

11,921 మందికి స్క్రీనింగ్​ ..

ఎట్​రిస్క్​ దేశాల నుంచి వచ్చిన 11,921 మందికి ఇప్పటివరకు స్క్రీనింగ్​ చేయగా 113 మందికి ఆర్టీపీసీఆర్​లో పాజిటివ్​ తేలింది. వీటిని జీనోమ్​ సీక్వెన్సింగ్ కు పంపగా 23 మందికి పాజిటివ్​ తేలింది. అంతేగాక నాన్​రిస్క్​ దేశాల నుంచి ర్యాండమ్​గా నిర్వహించే శాంపిల్స్​లో మరో 39 మందికి ఒమిక్రాన్​ తేలింది. వీరిలో ఇప్పటికే 13 మంది కోలుకున్నారు. అయితే ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్​ కేసుల్లో 46 మంది అసలు వ్యాక్సిన్​ తీసుకోకపోగా, 14 మంది రెండు డోసులు​, 2 సింగిల్​ డోసులు మాత్రమే తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. దీంతో ప్రతీ ఒక్కరూ విధిగా రెండు డోసులు తీసుకోవాల్సిందేనని మంత్రి హరీశ్​రావు నొక్కి చెప్పారు.

Next Story