34 వేల ఏళ్ళైనా చెక్కుచెదరని కళేబరం

by  |
34 వేల ఏళ్ళైనా చెక్కుచెదరని కళేబరం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఉత్తర కెనడా, యుకాన్ ప్రాంతంలోని డాసన్ సిటీ సమీపంలో 57 వేల ఏళ్ల కిందటి చెక్కుచెదరని తోడేలు కళేబరం ఒకటి లభ్యమైంది. తాజాగా రష్యాలోని సెర్బియా ప్రాంతంలో 34 వేల ఏళ్ల కిందటి ఉన్ని ఖడ్గమృగం అవశేషాలు బయటపడ్డాయి. కాగా, ఆ అవశేషాలపై పరిశోధనలు జరిపేందుకు సైంటిస్టులు వాటిని ల్యాబ్‌కు పంపారు. అయితే ఈ ఉన్ని ఖడ్గమృగం శిలాజ అవశేషాలు ఇన్ని ఏళ్ల తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఉండటం పట్ల సైంటిస్టులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఖడ్గ మృగాన్ని ఎవరో జాగ్రత్తగా భద్రపరిచారని చెబుతున్నారు.

ఈ ఉన్ని ఖడ్గమృగం మూడు లేదా నాలుగేళ్ల వయసులో చనిపోయి ఉంటుందని రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్.. పాలియోంటాలజిస్ట్(శిలాజ అవశేషాలపై పరిశోధనలు జరిపే శాస్త్రవేత్త) వలరి ప్లాట్నికొవ్ వెల్లడించారు. కాగా ఈ కళేబరం 20 వేల నుంచి 50 వేల ఏళ్ల కిందటిది కావొచ్చని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఖడ్గమృగం ఎన్నేళ్ల కిందటిది? అనేది రేడియోకార్బన్ స్టడీస్ ద్వారా పర్ఫెక్ట్‌గా తెలుస్తుందని అంటున్నారు. రష్యా, అబ్యిస్క్ జిల్లాలోని తీరేఖ్యాఖ్ నది తీరాన ఈ ఉన్ని ఖడ్గ మృగ కళేబరాలు లభ్యమయ్యాయి. దీనికి ‘సాష’గా నామకరణం చేసిన శాస్త్రవేత్తలు.. గ్లోబల్ వార్మింగ్ వల్ల శాశ్వత మంచు మెల్ల మెల్లగా కరిగిపోతున్నదని, తద్వారా మంచులోపల దాగి ఉన్న ఇలాంటి శిలాజ అవశేషాలు బయటపడుతున్నాయని తెలిపారు.



Next Story

Most Viewed