ఒక్కదాని కోసం.. 337 మంది పోటీ

by  |
ఒక్కదాని కోసం.. 337 మంది పోటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : మందుబాబులకు గుడి, బడి అనే తేడా ఏముంటుంది? ఎంజాయ్ చేయడానికి ఏదైతేనేం.. మందు కోసం ఎంతకైనా తెగించేస్తారు. సరిగ్గా ఈ టెక్నిక్‌ను పట్టేసింది ప్రభుత్వం. యాదగిరిగుట్టలో బార్ పెట్టాలని డెసిషన్ తీసుకుంది. ఇంకేముంది? కుప్పలు తెప్పలుగా ఎగబడ్డారు బార్ పెట్టడానికి. ఒకటి కాదు… రెండు కాదు.. ఏకంగా 337 అప్లికేషన్లు వచ్చాయి. డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

యాదగిరిగుట్ట అనగానే మనకు పుణ్యక్షేత్రమే గుర్తుకొస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యాదాద్రి అనే ఒక ఆథ్యాత్మిక క్షేత్రం యాదికొస్తుంది. ఇప్పుడు తెలంగాణ తిరుమల తరహాలో గుర్తింపు వస్తోంది. ఇట్లాంటి చోట బార్‌కు డిమాండ్ భారీగానే ఉంది. ఒక్కో అప్లికేషన్‌కు లక్ష రూపాయల చొప్పున ప్రభుత్వానికి రూ. 3.37 కోట్ల ఆదాయం వచ్చిపడింది. ఈ లక్ష రూపాయలు తిరిగి ఇచ్చేది లేకుండా ప్రభుత్వానికి సమకూరే ‘నాన్ రిఫండబుల్ డిపాజిట్‘. మొత్తం 337 మందిలో ఒక్కరికే బార్ పెట్టుకోడానికి అవకాశం లభిస్తుంది. మిగిలినవారంతా కట్టిన లక్ష రూపాయలను హుండీలో వేశామనుకుని సర్దుకోవాల్సిందే.

ఆథ్యాత్మికంగా డెవలప్ అవుతున్నా మద్యానికేం సంబంధం అన్నట్లుగా ఉంది యాదగిరిగుట్టలోని పరిస్థితి. ఇంతకాలం బార్ అనేదే లేదు. మేజర్ పంచాయతీ కాబట్టి వైన్ షాపులే గతి. కానీ ఈ మధ్య మున్సిపాలిటీ కావడంతో బార్ పెట్టుకునే సౌకర్యం ఏర్పడింది. ఎంచక్కా కూర్చుని గంటలకొద్దీ మాట్లాడుకునే అవకాశం దొరుకుతుందనుకుంటున్నారు మందుబాబులు. ఇలాంటి డిమాండ్ ఉంటుంది కాబట్టి వ్యాపారం కూడా మూడు బీర్లు.. ఆరు బ్రాందీలుగా ఉంటుందని ఆశపడుతున్నారు వ్యాపారులు.

అసలు ప్రభుత్వానికి నిఖార్సుగా టాక్సులు కడుతోంది మేమే అనేది మందుబాబుల అభిప్రాయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రతీ ఏటా మద్యం అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వానికి కూడా ఈ రంగం నుంచి రెవెన్యూ బాగా వస్తోంది. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా అన్ని చోట్లా మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. అది పుణ్యక్షేత్రమైనా, మెట్రో సిటీ అయినా… తేడాలేమీ లేవ్.

ఒకవైపు తిరుమల ఆలయం తరహాలో యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దానికి తగినట్లుగా వందల కోట్ల రూపాయలతో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆథ్యాత్మికంగా ఎంత అభివృద్ధి చెందుతున్నా మందు విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్న ధోరణి కనిపిస్తోంది. గతంలో హార్మోన్ ఇంజెక్షన్లతో వ్యభిచారం చేయించిన సంగతి తెలిసిందే. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి అపచారమా అని ఆవేదన చెందినవారున్నారు. దేవుడి గుడి పక్కన ఇంత ఘోరం జరుగుతుందా అని బాధపడినవారూ ఉన్నారు.

టెంపుల్ టౌన్ మాత్రమే కాదు.. టూరిజం స్పాట్‌గా కూడా యాదగిరిగుట్ట డెవలప్ అవుతోంది. టూరిజం అనగానే హోటళ్ళు, బీర్లు, బార్లు… రావాల్సిందే.


Next Story

Most Viewed