తెలంగాణకు రివర్స్ వలసలు

by  |
తెలంగాణకు రివర్స్ వలసలు
X

• బీహార్ నుంచి చేరుకున్న 300 మంది కూలీలు

దిశ, న్యూస్ బ్యూరో :

దేశవ్యాప్తంగా వలస కార్మికులు పరాయి రాష్ట్రాల నుంచి సొంతూళ్ళకు బయలుదేరుతూ ఉంటే తెలంగాణలో మాత్రం సొంతూళ్ళను విడిచిపెట్టి ఇక్కడ పనిచేసేందుకు వస్తున్నారు. ప్రస్తుతం వరిధాన్యం కొనుగోళ్ళు విస్తృతంగా జరుగుతూ ధాన్యం రైస్ మిల్లులకు చేరుతున్నందున హమాలీ కార్మికుల కొరత ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాన కార్యదర్శి ప్రత్యేక చొరవ తీసుకుని బీహార్ రాష్ట్రం నుంచి వలస కూలీలను రప్పించే ప్రయత్నం చేశారు. అవి ఫలించడంతో ఆ రాష్ట్రంలోని ఖగారియా నుంచి సుమారు 300 మంది వలస కార్మికులు ‘శ్రామిక్ ఎక్స్‌‌ప్రెస్’ రైలులో సాయంత్రానికి లింగపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, నోడల్ అధికారి సందీప్ సుల్తానియా తదితరులు వారికి స్వాగతం పలికారు. వీరందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరాన్ని బట్టి క్వారంటైన్‌లో ఉంచి ఆ తర్వాత నిర్దిష్ట ప్రాంతాల్లోని రైస్ మిల్లులకు తరలించనున్నారు.

రైస్ మిల్లుల్లో లోడింగ్, అన్‌లోడింగ్ పనుల్లో దీర్ఘకాలంగా బీహార్‌కు చెందిన కూలీలే హమాలీ కార్మికులుగా పనిచేస్తున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో చాలా మంది కాలినడకన సొంతూళ్ళకు వెళ్ళిపోగా, తాజాగా కేంద్రం ప్రభుత్వం ఆంక్షల సడలింపు తర్వాత భారీ సంఖ్యలో వెళ్ళిపోయారు. దీంతో రైస్ మిల్లుల్లో పని దాదాపుగా మందగించింది. ఈ పరిస్థితి తలెత్తుతుందని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా రోజుల క్రితమే బీహార్ నుంచి కూలీలను రప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగా ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి తొలి విడతగా 300 మందిని తీసుకురాగలిగారు. రానున్న రోజుల్లో మరికొంత మంది వస్తారని అంచనా వేస్తున్నారు.

స్టేషన్‌కు చేరుకున్న వీరికి మునుపెన్నడూ లేని తీరులో పూలతో స్వాగతం పలికారు. అందరికీ థర్మల్ స్కానింగ్ నిర్వహించి తాత్కాలికంగా క్వారంటైన్‌కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం వీరిని నిర్దిష్ట ప్రాంతాల్లోని రైస్ మిల్లులకు తరలిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీరి అవసరం ఉన్నందున వీరికి భోజన, వసతి సౌకర్యాలకు ఎక్కడా కొరత రాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికంగా ఉన్న ప్రభుత్వ సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి. వీరిని కరీంనగర్, కామారెడ్డి, నల్లగొండ, మిర్యాలగూడ, జగిత్యాల, సుల్తానాబాద్, సిద్దిపేట తదితర ప్రాంతాల్లోని రైసుమిల్లులకు పంపనున్నారు. అన్ని రాష్ట్రాల్లో సొంతూళ్ళకు వలస వెళ్తూ ఉంటే తెలంగాణలో మాత్రం దానికి రివర్సుగా జరుగుతోంది.

Tags: Migrant workers, Bihar, Rice mills, Telangana, shramik express

Next Story

Most Viewed