ఆటో మీద పడ్డ లారీ.. ఒకే ఫ్యామిలీలో ముగ్గురు మృతి

by  |
ఆటో మీద పడ్డ లారీ.. ఒకే ఫ్యామిలీలో ముగ్గురు మృతి
X

దిశ, 8 ఇంకలైన్ కాలనీ : అతివేగం.. అజాగ్రత్త ఒకే కుటుంబంలోని ముగ్గురిని బలిగొంది. ఈ విషాద ఘటన గోదావరిఖని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి గంగానగర్ రహదారిపై సోమవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామగుండం మండలం ముబారక్‎నగర్‌కు చెందిన షేక్ షకీల్ కుటుంబ సభ్యులతో కలిసి మంచిర్యాల జిల్లా ఇందారంలో ఓ ఫంక్షన్‌కు వెళ్లి ప్యాసింజర్ ఆటోలో తిరిగి వస్తున్నారు.

ఇదే క్రమంలో గంగా నగర్ ఫ్లై ఓవర్ వద్ద బొగ్గు లోడ్‌తో వెళ్తున్న లారీ యూ టర్న్ తీసుకుంటుండగా.. అది గమనించిన ఆటో డ్రైవర్ ఆటోను రోడ్డుపక్కన నిలిపి ఉంచాడు. ఇదే సమయంలో ఫ్లై ఓవర్ మీదుగా అతివేగంతో వచ్చిన బూడిద లారీ.. బొగ్గు లారీని ఢీకొట్టింది. మితిమీరిన వేగంతో ఢీకొట్టడంతో రెండు లారీలు పడిపోయాయి.

ఈ క్రమంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఆటో పై బూడిద లారీ పడటంతో ఆటోలో ప్రయాణిస్తున్న షేక్ షకీల్(28), అతని భార్య షేక్ రేష్మా(25), అతని కుమార్తె షేక్ షాధీ ఉమెరాలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పెద్ద సంఖ్యలో ఘటన స్థలానికి చేరుకొని ఆటోలో ఇరుకున్న వారిని బయటకు తీశారు. కాగా తీవ్రంగా గాయపడటంతో అప్పటికే షేక్ షకీల్, రేష్మా, ఉమెరాలు మృతి చెందారు. ఆటో డ్రైవర్, మిగితా కుటుంబ సభ్యులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో పారిశ్రామిక ప్రాంతంలో విషాధచాయలు అలుముకున్నాయి.

Next Story