పులివెందులకు మంచి కంపెనీ వస్తోంది.. త్వరలో 2 వేల ఉద్యోగాలు: సీఎం వైఎస్ జగన్ 

by  |
YS Jagan
X

దిశ, ఏపీ బ్యూరో: మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు వైఎస్ఆర్ కడప జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. రెండో రోజైన శుక్రవారం సీఎం వైఎస్ జగన్ పులివెందుల ఇండస్ట్రియల్ పార్క్ లో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ కంపెనీకి శంకుస్థాపన చేశారు. రూ. 128.56 కోట్లతో పులివెందులలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్దాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పులివెందుల ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్క్ లో రూ.110 కోట్లతో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ కు శంకుస్థాపన చేశారు. 353.02 ఎకరాలలో 8,042 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాల పంపిణీ చేశారు. మరోవైపు పులివెందుల మున్సిపాలిటీలోని 7,309 మంది లబ్దిదారులకు, బ్రాహ్మణపల్లి హౌసింగ్ కాలనీలో 733 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలను సీఎం పంపిణీ చేశారు.

వీటితోపాటు రూ. 10.50 కోట్ల నిధులతో పులివెందుల మార్కెట్ యార్డులో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. పులివెందులలో రూ. 3.64 కోట్లతో మోడల్ పోలీస్ స్టేషన్, రూ.1.50 కోట్లతో పెద్దముడియం పోలీస్ స్టేషన్, రూ.32 లక్షలతో కాశినాయన పోలీస్ స్టేషన్ లో నిర్మించిన డార్మెటరీ ప్రారంభించారు. రూ.2.60 కోట్లతో పులివెందుల రాణితోపు వద్ద ఆక్వాహబ్‌ను ప్రారంభించారు.

అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ…పులివెందులకు మంచి కంపెనీ వస్తోందని చెప్పుకొచ్చారు. ఆదిత్య బిర్లా కంపెనీ టెక్స్ టైల్స్ పరిశ్రమ వస్తోందని వెల్లడించారు. ఫార్చ్యూన్-500 కంపెనీల్లో ఆదిత్య బిర్లా సంస్థ కూడా ఒకటని సీఎం వివరించారు. పులివెందులలో ఆదిత్య బిర్లా కంపెనీ ఏర్పాటు ద్వారా తొలిదశలో 2 వేలకు పైగా ఉద్యోగాలు వస్తాయి. పులివెందుల ప్రజలకు అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఏపీలో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామికవేత్తలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు సీఎం జగన్ వైఎస్ఆర్ ఘాట్ వద్ద తండ్రికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాష, మంత్రులు ఆదిమూలపు సురేష్, అప్పలరాజు, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed