98 డీఎస్సీ అభ్యర్థుల కల.. నెరవేరేదెలా ?

by  |
dsc-batch-123
X

దిశ, కరీంనగర్ సిటీ : మీకు ఉద్యోగాలు ఇస్తాం మీరు ఉపాధ్యాయుల అవుతారు, కొంచెం ఓపిక పట్టండి ఆశలు నెరవేరుతాయి, అంటూ ఏడేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కరీంనగర్ కు వచ్చిన కేసీఆర్ వారికి అభయమిచ్చాడు. రెండు దశాబ్దాలుగా తాము చేస్తున్న పోరాటానికి ఫలితం లభించబోతుందని సంబరపడ్డారు. కానీ, ఏళ్లు గడుస్తున్నా, ఉద్యోగ విరమణ వయస్సు కూడా దాటబోతున్నా, ఇప్పటివరకు వారికి ఎలాంటి అవకాశం కల్పించలేదు. అయినా, ఆశ చావక వచ్చే అధికారులను, పోయే ప్రజాప్రతినిధులను కలుస్తూనే ఉన్నారు. వారి గోడు వెళ్లబోసుకుంటూ, వినతిపత్రాలు అందజేస్తూనే ఉన్నారు. అధికారులు కళ్ళు తెరవాలని కోరుతూ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేస్తూనే ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1998 లో నిర్వహించిన డిఎస్సీలో 2,333 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ప్రకటించారు. ఐదు వేలకు పైగా అభ్యర్థులు రాత పరీక్షకు హాజరయ్యారు.

అత్యధిక మంది క్వాలిఫై మార్కులు సాధించారు. ముందుగా విడుదల చేసిన జీవో 221 ప్రకారం అర్హత పొందిన అభ్యర్థులు తక్కువగా ఉన్నారంటూ, ఆయా కేటగిరీల్లో మార్కులు తగ్గించి అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచారు. కటాఫ్ తగ్గించగల ఇంటర్వ్యూకి వచ్చిన అభ్యర్థులకు ఎక్కువ మార్కులు వేసి అప్పటి అధికారులు పోస్టింగ్లు ఇచ్చారు. దీంతో మొదటి జీవో నిబంధన మేరకు, రాత పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చి ఇంటర్వ్యూకి వచ్చిన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. పేర్కొన్న అంశాలకు వ్యతిరేకంగా నాన్ లోకల్ అభ్యర్థులకు ఎక్కువ సంఖ్యలో పోస్టింగులు ఇచ్చారు. ఈ అవకతవకలను హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా గుర్తించి డీఎస్సీ క్వాలిఫైడ్ భర్తీ చేయాలని ఆదేశించింది. కానీ మిగతా పోస్టులను భర్తీ చేయకుండా అధికారులు క్యారీ ఫార్వర్డ్ చేశారు. జీవో ఎంఎస్ 65 ప్రకారం మహిళ, పీహెచ్ సి, ఎక్స్ సర్వీస్ మెన్ పోస్టులను చేయకూడదు.

1999 మార్చి 19 న జీవో ఎంఎస్ నంబర్ 95 ను ప్రభుత్వం విడుదలచేసింది. దీనిలో పేర్కొన్న నాలుగు జిల్లాలో సెలక్షన్ సక్రమంగా జరగలేదని గుర్తించి క్యారీ ఫార్వర్డ్ పోస్టులతో పాటు నాన్ జాయినింగ్ పోస్టులను కూడా ఆయా జిల్లాలోని 1998 క్వాలిఫైడ్స్ తో భర్తీ చేయాలని జీవోలో పేర్కొన్నారు. అయినా, నేటికీ అది అమలు కాలేదు.

ఖాళీలపై వేర్వేరు నివేదికలు

జిల్లాలో నోటిఫైడ్ అయిన పోస్టులు 2339. వీటిలో నుంచి 1478 పోస్టులు భర్తీ చేయగా, 860 ఖాళీలున్నాయని 1999 లో హైకోర్టుకు అప్పటి జిల్లా విద్యాశాఖాధికారి నివేదిక సమర్పించారు. 2014 సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో 1544 ఖాళీలున్నాయని ఇదే అధికారులు నివేదిక ఇచ్చారు. వివిధ కోర్టుల్లో వేసిన ప్రతి సారి డీఎస్సీ 1998 రిక్రూట్మెంట్లో ఖాళీల్లో మార్పులు, చేర్పులు చేస్తూ నివేదికలు అందజేస్తున్నారు. జిల్లాలో 250 మందికి నాన్ లోకల్ అభర్థులకు ఉద్యోగాలు ఇచ్చారు. ఇన్ని అవకతవకలు చేసిన కూడా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా తెలంగాణ ప్రభుత్వం మీనమేశాలు లెక్కిస్తోందని అభ్యర్థులు మండిపడుతున్నారు. నోటిఫైడ్ చేసిన ఖాళీల్లో భర్తీ చేసినవి కాకుండా క్యారీ పార్వర్డ్ చేసిన సుమారు 850 పోస్టులతో పాటు మిగిలిన డీఎస్సీ 1999 క్వాలిఫైయిడ్ అభ్యర్థులతో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కోర్టులకు తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Next Story

Most Viewed