అంత్యక్రియలకు వెళ్లి 18మంది మృతి

by  |
అంత్యక్రియలకు వెళ్లి 18మంది మృతి
X

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం మురద్‌నగర్‌లో ఘోరం జరిగింది. శ్మశాన వాటికలోని షెల్టర్ కుప్పకూలడంతో 18మంది మృతిచెందగా, 38 మందిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మురద్‌నగర్‌లోని దయానంద్ కాలనీలో శనివారం ఓ వ్యక్తి మృతిచెందారు. ఆదివారం అంతిమయాత్ర నిర్వహించగా 100మందికి పైగా హాజరయ్యారు. శ్మశాన వాటికకు చేరుకోగానే ఒక్కసారిగా వర్షం పడటంతో అక్కడే ఉన్న షెల్టర్ కిందికి వెళ్లారు. ఒక్కసారిగా పైకప్పు కూలి వారిపై పడింది. కొంత మంది బయటకు పరుగెత్తి ప్రాణాలను కాపాడుకున్నారు. రాళ్లురప్పలు మీద పడటంతో కొందరు ముందుకు కదల లేకపోయారు. దాదాపు 40మందికిపైగా శిథిలాల కింద చిక్కుకుపోయారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శిథిలాల కింద ఉన్న పలువురిని రక్షించి ఘజియాబాద్ జిల్లాకు హాస్పిటల్‌కు తరలించారు. 18మంది ప్రాణాలను కోల్పోయారు. కూలిన షెల్టర్ భవనం చాలా కాలం క్రితం నిర్మించింది కాదు. కానీ, లోతట్టు ప్రాంతంలో నిర్మించడంతో ఎప్పుడూ నీళ్లు నిలిచి ఉండేవి. భారీ వర్షాలు కురుస్తుండటంతో భూమి కుంగుబాటుకు గురై ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. భవనం కూలి 18మంది మృతిచెందడంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. సంఘటనపై విచారణ జరిపించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.



Next Story

Most Viewed