హర్షవర్ధన్, పోఖ్రియాల్, రవిశంకర్, జవడేకర్‌ల రిజైన్

by  |
Union ministers Harsha Vardhan, Javadekar
X

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు గంటల ముందు కనీసం 13 మంది మంత్రులు రాజీనామా చేశారు. మోడీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కేంద్ర మంత్రులు రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్‌లు మంత్రిమండలి నుంచి తప్పుకోవడం పార్టీ వర్గాలనూ ఆశ్చర్యానికి గురిచేసింది. వీరితోపాటు బాబుల్ సుప్రియో, సదానంద గౌడ, సంతోశ్ గంగ్వార్, దేబాశ్రీ చౌదరి, రతన్ లాల్ కటారియా, సంజయ్ ధోత్రె, థావర్‌చంద్ గెహ్లాటత్, ప్రతాప్ చంద్ర సారంగి, అశ్విని చౌబేలూ రాజీనామా చేసినట్టు సమాచారం. రమేశ్ పోఖ్రియాల్, సంతోశ్ గంగ్వార్‌లు తమ రాజీనామాకు ఆరోగ్య సమస్యలను కారణాలుగా పేర్కొన్నట్టు తెలిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొన్ని వారాలుగా కేంద్ర మంత్రుల ప్రదర్శనను వ్యక్తిగతంగా పిలుచుకుని అంచనా వేసిన సంగతి తెలిసిందే.

ఆరోగ్య శాఖ మంత్రి, సహాయ మంత్రి ఔట్

కరోనా సెకండ్ వేవ్‌ను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్న పదునైన విమర్శల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, ఆయన సహాయ మంత్రి అశ్విని చౌబే రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. ప్రతిపక్షాలు దీన్ని ప్రస్తావిస్తున్నాయి. కరోనా మహమ్మారిని నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్న విషయాన్ని ఈ మార్పులతో అంగీకరించినట్టయిందని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ట్వీట్ చేశారు. వీరి రాజీనామాలోనూ ఓ రహస్య సందేశముందని, అన్ని సక్రమంగా జరిగితే క్రెడిట్ ప్రధానికి వెళ్తుందని, లేదంటే మంత్రి పదవి తారుమారవుతుందని పేర్కొన్నారు. విధేయత, అణకువలకు మంత్రులు చెల్లించే మూల్యం ఇదేనని తెలిపారు.



Next Story

Most Viewed