12 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు

by  |
12 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు
X

తెలంగాణ వార్షిక బడ్జెట్ సమావేశాలు పన్నెండు రోజుల పాటు జరగనున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించాలని స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ (బిజినెస్ అడ్వయిజరీ కమిటీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8వ తేదీన మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత వరుసగా రెండు రోజుల పాటు సెలవులు ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయం జరిగింది. అదే విధంగా ఈ నెల 15వ తేదీన ఆదివారం కూడా సెలవుదినంగా సమావేశం నిర్ణయించింది. మొత్తం పన్నెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో కరోనా వైరస్, ఎన్నార్సీ, సీఏఏ, కొత్త చట్టాలకు అనుగుణంగా బిల్లుల సమర్పణ తదితరాలపై చర్చ జరగనుంది. బడ్జెట్‌పై చర్చల అనంతరం రానున్న ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపడంతో ఈ సమావేశాలు ముగుస్తాయి.

రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించాల్సి ఉన్నందున పన్నెండు రోజుల సమయం సరిపోదని కాంగ్రెస్ పక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. అవసరమైతే సమావేశాలు జరుగుతున్నప్పుడే మరింత ఎక్కువ సమయం కేటాయించడంపై చర్చించుకోవచ్చని ముఖ్యమంత్రి సూచించడంతో ప్రస్తుతానికి పన్నెండు రోజులకే సమావేశాలు పరిమితమవుతున్నాయి. ఈ సమావేశంలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు గౌడ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, వినయ్ భాస్కర్, గొంగడి సునీత, అక్బరుద్దీన్ ఒవైసీ, శాసనసభ కార్యదర్శి పాల్గొన్నారు. ప్రతిపక్షాలు లేవనెత్తే ఏ అంశంపైన అయినా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకోసం సభా సంప్రదాయాలను పాటించాల్సిందిగా సూచించామని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మీడియాకు వివరించారు.



Next Story

Most Viewed