వలసల ఎఫెక్ట్: పెరుగుతున్న కేసులు

by  |
వలసల ఎఫెక్ట్: పెరుగుతున్న కేసులు
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముందుగా ఊహించినట్లుగానే రాష్ట్రానికి వలస వస్తున్నవారితో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 119 మంది వలస వచ్చినవారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లాలో 35 మందికి, జగిత్యాల జిల్లాలో 30 మందికి, మంచిర్యాల జిల్లాలో 23 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరంతా ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చినవారే. కువైట్ నుంచి ‘వందే భారత్’ విమానంలో వచ్చిన నలుగురికి కూడా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో విదేశాల నుంచి వచ్చిన ఏడుగురికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 119 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు స్పష్టమైంది. ఇదిలా ఉండగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శనివారం 33 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన 19 మందికి తాజాగా కరోనా నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,813కు చేరుకుంది. ఇందులో 1,068 మంది డిశ్చార్జి కాగా, ఇంకా 696 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం ఒకరు కరోనా కారణంగా మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 49కు చేరుకుంది.

ఈ నెల 25 నుంచి దేశీయ విమాన సేవలు మొదలవుతుండడంతో వైద్యారోగ్య శాఖ సిబ్బందిలో ఆందోళన పెరుగుతోంది. థర్మల్ స్క్రీనింగ్ లాంటి చర్యలు ఎన్ని తీసుకున్నా విమానాల్లో వచ్చేవారికి క్వారంటైన్ నిబంధన లేకపోవడంతో కరోనా లక్షణాలు ఉన్నట్లయితే ఎంత మందికి అంటుకుంటుందో, పాజిటివ్ కేసుల సంఖ్య ఇంకా ఎంత పెరుగుతుందో అనే భయం పట్టుకుంది. కరోనా లక్షణాలేవీ లేకుండానే టెస్టుల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అవుతుండటంతో థర్మల్ స్క్రీనింగ్‌లో బైటపడే అవకాశం ఉండదని, ఎవ్వరికీ తెలియకుండానే పాజిటివ్ క్యారియర్లుగా ఇతరులకు సోకే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.



Next Story

Most Viewed