ఆ ఇంట్లో కొడుకు లేని లోటు తీరింది.. పూజారిగా పదేళ్ల బాలిక..!

by  |
ఆ ఇంట్లో కొడుకు లేని లోటు తీరింది.. పూజారిగా పదేళ్ల బాలిక..!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తన ఏజ్ పిల్లలందరూ ఆడుకుంటుంటే ఆ బాలిక మాత్రం కుటుంబ భారం మోసేందుకు సిద్ధపడింది. ఆ ఇంట్లో కొవిడ్ తెచ్చిన పెను విషాదం అనంతరం కొడుకు లేని లోటును తీర్చేందుకు కంకణం కట్టుకుంది. తల్లితో పాటు ఇద్దరు చెల్లెల్ల అలనా పాలనను ఆమె మీదే వేసుకుంది. ఎడవ తరగతి చదువుకుంటున్న పదేళ్ల బాలిక చూపించిన తెగువకు ఆ ఊరి వారంతా శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. అతి చిన్న వయస్సులోనే తండ్రి పోగొట్టుకున్న కూతురు ప్రస్తుతం ఆ ఇంటికి పెద్దదిక్కుగా మారింది. తండ్రి బాటలోనే పూజలు, వ్రతాలు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.

వివరాల్లోకివెళితే.. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని బోర్గాంనకు చెందిన పూజారి సంతోష్ దంపతులకు ముగ్గురు సంతానం. అందరూ ఆడపిల్లలే. అయినా, ఎన్నడూ బాధపడలేదు. తనకు వంశపారం పర్యంగా సంక్రమించిన పౌరహిత్యం, పూజలు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకోస్తున్నాడు. బోర్గాం గ్రామంలో హనుమాన్ ఆలయంలో పూజారిగా విధులు నిర్వహిస్తోన్న సంతోష్ గత నెలలో కొవిడ్ బారిన పడ్డాడు. దీంతో అతని ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతినటంతో ప్రాణాలు కోల్పోయాడు. సంతోష్ మరణంతో ఒక్కసారిగా అతని కుటుంబం రోడ్డున పడింది. ఇంటికి ఎకైక మగ దిక్కు చనిపోవడంతో ఈ ఇళ్లు గడవడం కష్టమైంది. క్లిష్టపరిస్థితుల్లో సంతోష్ కూతురు శ్రీవిద్య ఆ ఇంటి బాధ్యతను తనపై వేసుకుంది. గ్రామంలో, తెలిసిన వారి ఇళ్ళల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా అన్ని రకాల వ్రతాలు, చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ కుటుంబానికి పెద్ద కొడుకుగా మారింది. తాను ఎడవ తరగతి చదువుతున్నాని, తన తండ్రి బతికున్నప్పుడు ఇలా పూజలు, వ్రతాలు చేయించటం నేర్పించాడని చెబుతోందిం శ్రీవిద్య. తండ్రి కాలం చేసిన 15 రోజుల్లోనే తిరిగి తన అతను నేర్పించిన విద్యను తన కుటుంబం క్షేమం కోసం ఉపయోగిస్తూ ఇంటికి పెద్ద దిక్కు అయ్యింది. బోర్గాం గ్రామంలో చాలా మంది శ్రీవిద్య పూజా, వ్రతాలు చేయించే శైలిని గమనించి తండ్రికి తగ్గ తనయగా అభివర్ణిస్తున్నారు. వారి కుటుంబానికి ఆసరగా నిలించేందుకు గ్రామస్తులు కూడా ముందుకు వచ్చి సహకరిస్తున్నారు.


Next Story

Most Viewed