ఒకే ఇంట్లో కలిసి ఉన్నా.. అంతా సైలెంట్! కారణం అదే..

by  |
Youth and women top in data usage
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : రోజురోజూకు మనుషుల మధ్య మాటలు తగ్గిపోతున్నాయి. మాటల్లేవ్.. మాట్లాడుకోవటాల్లేవ్.. ఒకే ఇంట్లో కలిసి ఉన్నా.. నలుగురు ఒకచోట కలిసినా ఎవరి లోకం వారిదే.. సిటిజనులు ఒంటరై పోతున్నారు. తోటి వారితో మాట్లాడేందుకు టైం దొరకడం లేదు. ఒకరితో మరొకరి మధ్య సంబంధాలు గగనమైపోతున్నాయి. మహానగరిపై ‘అలిండియా డేటా యూసేజ్ మొబైల్ సొసైటీ’ సర్వే చేసి ఈ వివరాలను వెల్లడించింది. ‘నెటిజన్లు’గా మారిపోతున్న సిటిజన్లు సెల్ ఫోన్‌లో మూగ సందేశాలకే పరిమితమవుతున్నట్లు పేర్కొంది.

ఆన్‌లైన్ మాయ..

మనిషికి ఏదైనా ఆనందం వచ్చినా.. కష్టం కలిగిన మొన్నటి వరకు ఆత్మీయులతో చెప్పుకొని గుండె బరువును దించుకునేవారు. నలుగురితో మాట్లాడి మనస్సును కుదుట పరుచుకునేవారు. కానీ ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా స్మార్ట్ ఫోన్‌లో ఇంటర్నెట్‌కు అతుక్కుపోతున్నారు. వాట్సాప్, ఫేస్ బుక్ మెసెంజర్‌లో చాటింగ్‌లతో బిజీబిజీగా గడుపుతున్నారు. యూట్యూబ్, రకరకాల యాప్‌లతో కాలక్షేపం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం వరకు ఇంటర్నెట్ సెంటర్‌కు వెళ్లి అంతర్జాలాన్ని వినియోగించే వారు ప్రస్తుతం తమ ఇంటికే నేరుగా నెట్ కనెక్షన్ తీసుకుంటున్నట్లు సర్వే తేల్చింది. ఇంటర్నెట్‌ను విపరీతంగా వాడుతూ స్మార్ట్ ఫోన్‌తోనే టైంపాస్ చేయడంతో మానవాళి మధ్య సంబంధాలు తగ్గిపోయాయి.

నగరవాసులే ముందంజ..

తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్‌నెట్ డేటా వినియోగిస్తున్న వారిలో నగరవాసులే ముందంజలో ఉన్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. డేటా మొత్తంలో ఇక్కడే 65శాతం వాడేస్తున్నట్లు తెలిపారు. జనాభాలో 20శాతం మంది 56.49మిలియన్ డాటాను, 15శాతం మంది నిరంతరం ఆన్‌లైన్‌లోనే గడుపుతూ 43.04మిలియన్ డాటాను వినియోగిస్తున్నట్లు మొబైల్ సంస్థల సర్వేలో తేల్చారు. వారంలో నాలుగైదు సార్లు నెట్‌ను ఆన్ చేసే వారు 12శాతం మంది 32.28మిలియన్ డాటాను వాడుతున్నారు. వారానికి రెండు సార్లు వాడేవారు 14శాతం మంది, వారానికి ఒకసారి వాడేవారు 8శాతం మంది, నెలకు రెండుసార్లు నెట్ వాడే వారు 5శాతం ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి.

యువత, మహిళలే టాప్..

ఇంటర్‌నెట్ డేటా వినియోగించే వారిలో యువత, మహిళలే టాప్‌లో ఉన్నట్లు సర్వేలో గుర్తించారు. ప్రతిరోజు 42శాతం యువత, మహిళలు ఆన్‌లైన్‌లో తెగ బీజీగా ఉంటున్నట్లు తేల్చారు. వారి తర్వాత 36శాతం కాలేజీ విద్యార్థులు, 28శాతం స్కూల్ పిల్లలు, 15శాతం వృద్ధులు, 8శాతం వర్కింగ్ ఉమెన్స్ డేటా వాడుతున్నట్లు గణాంకలు స్పష్టం చేస్తున్నాయి. మహిళలు తనకు ఇష్టమైన సీరియళ్లు, సినిమాలు, ఆన్ లైన్ షాపింగ్ కోసం తెగ వాడుతున్నట్లు తెలుస్తోంది. సిటీలో గృహాల్లో ఉన్నవారు వాడే డేటా కూడా తక్కువేం కాదు. గత ఐదేళ్లలో 50శాతం నుంచి 88శాతానికి వినియోగం పెరిగినట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్ క్లాసులు, గేమ్స్ కోసం విద్యార్థులు డేటాను వాడుతున్నట్లు తేలింది. మొత్తం మీద 60శాతం పురుషులు, 40శాతం మహిళలు డేటాను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అత్యధిక డేటా వినియోగంలో స్మార్ట్ ఫోన్లు టాప్‌గా ఉన్నట్లు గణంకాలు చెబుతున్నాయి. స్మార్ట్ ఫోన్ల ద్వారా 82శాతం, డెస్క్‌టాప్, ల్యాప్ టాప్‌ల ద్వారా 13శాతం, టాబ్లెట్ ద్వారా 5శాతం డేటాను వాడుతున్నట్లు సర్వేలో తేలింది.

కరోనా నుంచి..

కరోనా నగర జీవన విధానంలో అనేక మార్పులు తెచ్చింది. లాక్ డౌన్ వల్ల ఇళ్లకే పరిమితం కావడం. కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులందరూ వర్క్ ఫ్రం హోమ్‌కే పరిమితమై స్వతహాగా నెట్ కనెక్షన్లు తీసుకోవడం కూడా డేటా వినియోగం బాగా పెరిగింది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ జనాభా కోటి ముప్పై లక్షలుండడం.. వీరిలో దాదాపుగా 40లక్షల మంది వరకు మొబైల్ వినియోగిస్తున్నట్లు సర్వేలో తేల్చారు. ఇకపోతే కొందరు రెండు, మూడు కనెక్షన్లు వాడుతున్నారు. బీఎస్ఎన్ఎల్‌తోపాటు ఐడియా, జియో, ఎయిర్‌టెల్, వంటి పేరొందిన కంపెనీలతోపాటు దాదాపు 200లకు పైగా సంస్థలు ఇంటర్నెట్ సర్వీసులను అందిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే నగరంలో ఇటీవల మొబైల్ ఫోన్ల వాడకం బాగా పెరిగినట్లు మొబైల్ వ్యాపారి సుధీర్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే మొబైల్ కొనుగోళ్ల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. వివిధ కంపెనీలు స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తేవడంతో 200శాతం మేర మొబైల్ అమ్మకాలు వృద్ధి చెందినట్లు వ్యాపార వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Next Story

Most Viewed