అరాచకాలలో తాలిబన్లను మించిపోయిన వైసీపీబన్లు : నారా లోకేశ్

by  |
lokesh
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని వైసీపీ నేతలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తాలిబన్లతో పోల్చారు . వైసీపీబన్లు అరాచకాలలో ఆప్ఘనిస్తాన్ తాలిబన్లని మించిపోయారంటూ ట్విటర్ వేదికగా ఎద్దేవా చేశారు. తన తాడేపల్లి ప్యాలస్ పక్కన ఎవ్వరూ ఉండటానికి వీల్లేదని.. నిరుపేదల ఇళ్లను జగన్ రెడ్డి కూల్చేశారని ధ్వజమెత్తారు. ఇప్పుడు భద్రత పేరుతో భరతమాత గుండెలపై గునపం దింపారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకి 2 కోట్లతో గుడి కట్టించుకున్న జగన్ రెడ్డి.. తన ఇంటి దగ్గర భరతమాత విగ్రహాన్ని తొలగించడం ఆయన నిరంకుశ, ఫ్యాక్షన్ బుద్ధికి నిదర్శనమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్రొక్లయినర్లతో పెకలించిన భరత మాత విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని.. చేసిన మూర్ఖపు పనికి సీఎం జగన్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. మరోవైపు ఆదివాసుల రక్షణ చట్టాలను వైసీపీ ప్రభుత్వం కాలరాస్తోందని ధ్వజమెత్తారు. రంపచోడవం ఐటీడీఏ తీరుపై ఉద్యమిస్తున్న గిరిజనులపై అక్రమంగా కేసులు పెట్టి వేధించడం సరికాదని హితవు పలికారు. ‘నేలపై కూర్చోబెట్టి మరి గిరిజన ప్రతినిధులను అవమానించారు. గిరిజనుల రక్షణ చట్టాలు, జీవోలు ఖచ్చితంగా అమలు చేయాలి. లేటరైట్‌ పేరుతో సాగిస్తున్న బాక్సైట్‌ దందాను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలి’ అని ట్విటర్ వేదికగా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.

Next Story

Most Viewed