డబ్ల్యూటీసీ ఫైనల్.. కివీస్ కొత్త వ్యూహాలు

by  |
డబ్ల్యూటీసీ ఫైనల్.. కివీస్ కొత్త వ్యూహాలు
X

దిశ, స్పోర్ట్స్ : టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి సారిగా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌ను తేల్చేందుకు ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. జూన్ 18 నుంచి 22 వరకు ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా న్యూజీలాండ్‌తో టీమ్ ఇండియా తలపడనున్నది. వాతావరణ పరిస్థితులు, ఇంగ్లాండ్ పిచ్‌లు, మ్యాచ్‌లో ఉపయోగించే బంతులు అన్నీ కివీస్ ఆటగాళ్లకే అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇంగ్లాండ్ చేసుకున్న కివీస్ జట్టు మరో వారం రోజుల్లో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్నది. కీలకమైన డబ్ల్యూటీసీ ఫైనల్ ముందు బ్లాక్ క్యాప్స్‌కు ఇది మరింత మ్యాచ్ ప్రాక్టీస్‌ను ఇచ్చే అంశం. ఇన్ని అనుకూలత నడుమ ఇప్పుడు కివీస్ మరిన్ని వ్యూహాలకు పదును పెడుతున్నట్లు కనిపిస్తున్నది. భారత జట్టు బ్యాటింగ్ లైనప్‌ను ప్రత్యర్థి జట్లు ఎప్పుడూ టార్గెట్ చేస్తుంటాయి. ముఖ్యంగా టాపార్డర్‌లోని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, చతేశ్వర్ పుజార ఎప్పుడూ టార్గెట్ చేసుకొని బౌలర్లు బంతులు విసురుతుంటారు. కానీ ఈ సారి న్యూజీలాండ్ జట్టు తమ వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల కాలంలో న్యూజీలాండ్ బౌలర్లతో పాటు, తాజాగా బౌలింగ్ కోచ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

అతడే వారి టార్గెట్?

టీమ్ ఇండియా అనగానే ప్రతీ బౌలర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, పుజార, రహానేలను ఎలా అవుట్ చేయాలా అని చూస్తుంటారు. టాపార్డర్‌ను కుప్పు కూల్చితే ఇక మిగిలిన వికెట్లు వాటంతట అవే పడిపోతాయనే ధీమా ఉండేది. కానీ ఇదంతా ఒక ఏడాది క్రితం మాట. ఇప్పుడు టీమ్ ఇండియా లోయర్ ఆర్డర్‌లో రిషబ్ పంత్ ఒక పెద్ద అడ్డుగోడగా మారాడు. ఆస్ట్రేలియా పర్యటనలో, ఇంగ్లాండ్ సిరీస్‌లో పంత్ సత్తా ఏమితో పూర్తిగా తెలిసిపోయింది. అతడు కనుక కొద్ది నిమిషాలు క్రీజ్‌లో ఉంటే మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలడు. ఇటీవల కాలంలో పంత్ బ్యాటింగ్, కీపింగ్ విషయంలో ఎంతో పరిణితి చెందాడు. ఈ విషయాన్ని అన్ని జట్లు గమనిస్తూనే ఉన్నాయి. ఆస్ట్రేలియాతో వారి గడ్డపై జరిగిన సిరీస్‌లో పంత్ పోరాటాన్ని ప్రపంచమంతా చూసింది. న్యూజీలాండ్ బౌలింగ్ కోచ్ ఇప్పుడు అదే విషయాన్ని వెల్లడిస్తున్నాడు. ‘మా దృష్టిలో టాపార్డర్‌లో ఉన్న కోహ్లీ, రోహిత్, పుజార కంటే పంత్ చాలా ప్రమాదకరమైన వాడు. అతను తలచుకుంటే మ్యాచ్‌ను మొత్తం మార్చేయగలడు. గత కొన్నాళ్లుగా అతడి బ్యాటింగ్ చూస్తుంటే.. పంత్ సత్తా ఏమిటో తెలిసిపోతుంది. అతడిలో ఉండే సానుకూల దృక్పథమే పెద్ద బలం. ఇప్పుడు కివీస్ బౌలర్లు అతడి వికెట్ తీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు’ అని బౌలింగ్ కోచ్ జర్గెన్‌సెన్ అన్నాడు. న్యూజీలాండ్ జట్టు ఎంత భారత బ్యాటింగ్ లైనప్‌పై ఎంత ఫోకస్ పెట్టింది అనేది జర్గెన్‌సెన్ మాటల్లో అర్థమవుతున్నది.

టీమ్ ఇండియా వీక్నెస్ తెలుసుకున్నారా?

ఇక ఐపీఎల్‌లో ఆడిన ట్రెంట్ బౌల్డ్, కేల్ జేమిసన్, లాకీ ఫెర్గూసన్ భారత బ్యాట్స్‌మెన్ బలహీనతలు కొంచమైనా గ్రహించి ఉంటారు. ట్రెంట్ బౌల్డ్‌కు రోహిత్ శర్మ, కేల్ జేమిసన్‌కు విరాట్ కోహ్లీ ఎలా బ్యాటింగ్ చేస్తారో కాస్తైన అర్థమై ఉంటుంది. టీమ్ మీటింగ్స్‌లో వీరి వికెట్లు ఎలా తీయాలనే దానిపై కూడా తీవ్రమైన చర్చ జరుగుతున్నట్లు చెబుతున్నారు. మరోవైపు ఇంగ్లాండ్ జట్టుతో ముందుగానే టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుండటంతో ప్రాక్టీస్ లభిస్తున్నది. ఇక డబ్ల్యూటీసీలో వాడే డ్యూక్ బాల్స్‌తో కివీస్ బౌలర్లు తీవ్రంగా సాధన చేస్తున్నారు. భారత బ్యాట్స్‌మెన్ డ్యూక్ బాల్స్‌తో ఎక్కువగా ప్రాక్టీస్ చేయరనే విషయం తెలుసు. కాబట్టి ఆ బంతులతో మరింత సాధన చేయడం ద్వారా టీమ్ ఇండియాపై పై చేయి సాధించాలని కివీస్ భావిస్తున్నది. ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో వాతావరణ చల్లగా ఉన్నది. ఇది కచ్చితంగా కివీస్ జట్టుకు కలసి వస్తుంది. మరోవైపు టీమ్ ఇండియా కూడా తమ వ్యూహాలకు పదును పెడుతున్నది. వరుసగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లపై సిరీస్ గెలవడంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నది.

Next Story