కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. గడిచిన ఏడు నెలల్లో ఇదే అతిపెద్ద సింగిల్ డే పతనం..

by  |
stock markets copy
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి కుప్పకూలాయి. దక్షిణాఫ్రికాలో కొవిడ్-19 కొత్త వేరియంట్ అత్యంత వేగవంతంగా ప్రభావం చూపుతోందని, అంతర్జాతీయంగా మళ్లీ ప్రతికూల పరిస్థితులు తప్పవనే భయాల మధ్య మదుపర్లు ఒక్కసారిగా లాభాలు తీసుకునేందుకు సిద్దపడ్డారు. బీఎస్ఈ సెన్సెక్స్ అత్యంత దారుణంగా దాదాపు 1,700 పాయింట్ల వరకు కుదేలవడంతో వారాంతం ‘బ్లాక్ ఫ్రైడే’గా నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్ 12 తర్వాత గడిచిన ఏడు నెలల్లో అతిపెద్ద సింగిల్ డే పతనం ఇదేనని విశ్లేషకులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో పాటు దేశీయంగా కీలక కంపెనీల షేర్లు నష్టపోవడంతో సూచీలు శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభమైన గంటకే దెబ్బతిన్నాయి. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. చివరి గంటలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు సిద్ధపడటంతో భారీ పతనాన్ని స్టాక్ మార్కెట్లు ఎదుర్కొన్నాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,687.94 పాయింట్లు కుప్పకూలి 57,107 వద్ద, నిఫ్టీ 509.80 పాయింట్లు దెబ్బతిని 17,026 వద్ద ముగిసింది.

నిఫ్టీలో రియల్టీ ఇండెక్స్ అత్యధికంగా 6 శాతానికి పైగా క్షీణించగా, బ్యాంకింగ్, ఫైనాన్స్, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు 3.5-5 శాతం మధ్య పతనమయ్యాయి. ఫార్మా, హెల్త్‌కేర్ రంగాలు మాత్రమే సానుకూలంగా ర్యాలీ చేశాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో డా రెడ్డీస్, నెస్లె ఇండియా, ఏషియన్ పెయింట్, టీసీఎస్ షేర్లు మాత్రమే లాభాలను దక్కించుకోగా, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకి, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, టైటాన్, ఎంఅండ్ఎం, ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎల్అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎయిర్‌టెల్, కోటక్ బ్యాంక్, రిలయన్స్, ఐటీసీ లాంటి దిగ్గజ కంపెనీల షేర్లు 3-6 శాతం మధ్య అత్యధికంగా నష్టపోయాయి.


Next Story

Most Viewed