ఇరాన్ - ఇజ్రయెల్ మధ్య యుద్ధంలోకి అమెరికా.. స్పందించిన ఐక్యరాజ్య సమితి

by Gantepaka Srikanth |

ఇరాన్ - ఇజ్రయెల్ మధ్య యుద్ధం(Iran - Israel War) తారా స్థాయికి చేరింది. మరోవైపు.. అమెరికా(USA) రంగంలోకి దిగింది.

ఇరాన్ - ఇజ్రయెల్ మధ్య యుద్ధంలోకి అమెరికా.. స్పందించిన ఐక్యరాజ్య సమితి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్ - ఇజ్రయెల్ మధ్య యుద్ధం(Iran - Israel War) తారా స్థాయికి చేరింది. మరోవైపు.. అమెరికా(USA) రంగంలోకి దిగింది. బాంబర్లతో ఇరాన్‌పై విరుచుకుపడింది. అణుకేంద్రాలపై భారీ దాడులకు పాల్పడింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. తాజాగా ఈ యుద్ధంపై ఐక్యరాజ్య సమితి(United Nations) స్పందించింది. ఈ మేరకు ఐరాస సెక్రటరీ జనరల్ గుటెరస్ ప్రకటన విడుదల చేశారు. ‘ఇరాన్‌పై అమెరికా దాడులు చేయడం ఆందోళనకు గురి చేసింది. ఈ దాడి అంతర్జాతీయ శాంతి, భద్రతకు పెను ముప్పు. ఉద్రిక్తతల తగ్గింపునకు ఐరాస సభ్యదేశాలు కృషి చేయాలి. యూఎన్ చార్టర్ నియమాలను సభ్య దేశాలు పాటించాలి. సైన్యంతో ఉద్రిక్తతల నివారణకు పరిష్కారం కాదు.. దౌత్యమే మార్గం’ అని గుటెరస్ ప్రకటనలో పేర్కొన్నారు.

మరోవైపు.. ఇరాన్ - ఇజ్రయెల్ దాడి నేపథ్యంలో ట్రంప్‌ అమెరికా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. ‘ఇరాన్‌పై చేసిన దాడులు విజయవంతమయ్యాయి. యుద్ధానికి ముగింపు పలకాల్సిన పరిస్థితికి ఇరాన్‌ వచ్చింది. కీలకమైన అణుస్థావరాలను ధ్వంసం చేశాం. దాని అణుసామర్థ్యాన్ని నాశనం చేయడమే మా లక్ష్యం. ప్రపంచం ఎదుర్కొంటున్న అణు ముప్పును ఆపడమే మా లక్ష్యం. పశ్చిమాసియా దేశాలను ఇరాన్‌ భయపెడుతోంది. ఇప్పుడు ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత టెహ్రాన్‌దే. ఇరాన్‌లో ఇంకా కొన్ని లక్ష్యాలు మిగిలే ఉన్నాయి. టెహ్రాన్‌ శాంతిని నెలకొల్పకపోతే.. దాడులు మరింత తీవ్రంగా ఉంటాయి. యూఎస్, టెల్‌అవీవ్‌ కలిసి పనిచేస్తాయి’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.

Next Story