మరోసారి వక్రబుద్ధి బయటపెట్టిన పాక్.. వారికి మరణశిక్ష రద్దు చేస్తూ చట్టాల సవరణ

by Yella Dhawani Reddy |

పాకిస్తాన్ ప్రభుత్వం దేశంలోని నేర చట్టాల్లో సవరణలు చేస్తూ మరో వివాదస్పద నిర్ణయం తీసుకుంది.

మరోసారి వక్రబుద్ధి బయటపెట్టిన పాక్.. వారికి మరణశిక్ష రద్దు చేస్తూ చట్టాల సవరణ
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ (Pakistan) ప్రభుత్వం దేశంలోని నేర చట్టాల్లో కీలక సవరణలు చేసింది. ఇందులో భాగంగా ఉగ్రవాదులకు (Terroists), హైజాకర్లకు (Hijackers) ఆశ్రయం కల్పించిన వారికి మరణశిక్షను రద్దు చేస్తూ వివాదస్పద నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు క్రిమినల్‌ చట్ట సవరణ బిల్లు-2025ను ప్రవేశపెట్టగా, పాక్ సెనెట్‌ దానికి ఆమోదం తెలిపింది. దీనిపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

పాక్ పీనల్ కోడ్ ప్రకారం, ఇప్పటివరకు హైజాకర్లకు ఉద్దేశపూర్వకంగా ఆశ్రయం కల్పించిన వారు మరణశిక్షకు గురయ్యే విధానం ఉండేది. ఇప్పుడు ఈ శిక్షను తొలగించి యావజ్జీవ కారాగార శిక్ష విధించేలా మార్పులు చేశారు. అదే విధంగా, బహిరంగంగా మహిళలపై బలప్రయోగం చేసి వారిని వివస్త్రం చేయడం వంటి నేరాలకు కూడా గతంలో మరణశిక్ష అమలులో ఉండగా, ఇప్పుడు దానిని తగ్గించి సర్వోన్నతంగా జీవిత ఖైదుగా మార్చారు. అత్యంత తీవ్రమైన నేరాల్లో మాత్రమే మరణశిక్ష విధించేలా సవరణ బిల్లును రూపొందించింది. త్వరలోనే ఈ బిల్లు చట్టరూపం దాల్చనుంది. అయితే, దీనిపై విపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా పాక్‌ ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకోలేదు.

కాగా, పాకిస్తాన్‌ గత కొంతకాలంగా ఉగ్రవాదానికి స్వర్గధామంగా మారిందని భారత్ సహా అంతర్జాతీయ సంఘాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ వంటి పాక్షిక ముఠాలు పాక్‌ గడ్డ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. లష్కరే అధినేత హఫీజ్‌ సయీద్‌ను పాక్‌ జైల్లో ఉంచినట్టు చెబుతున్నా, అతడికి ప్రత్యేక సౌకర్యాలు అందుతున్నాయని నిఘా వర్గాల సమాచారం. జైషే చీఫ్‌ మసూద్‌ అజార్‌కు స్వయంగా ప్రభుత్వం సెక్యూరిటీ అందిస్తోందని కథనాలు వెల్లడించాయి. ఇలాంటి నేపథ్యంలో, హైజాకర్లకు సహాయం చేసినవారిపై శిక్షలను తగ్గించడం పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదనే ఆరోపణలకు బలమిస్తుంది. విపక్షాలు, మానవహక్కుల సంస్థలు కూడా ఈ చట్టంపై కఠిన విమర్శలు వ్యక్తం చేస్తున్నా, పాక్ ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతోంది.

Next Story