టెహ్రాన్ నుంచి వెళ్లిపోండి: భారతీయులకు కేంద్రం హెచ్చరిక

by Shamantha N |

ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య భీకర ఘర్షణలు చోటు చేసుకుంటున్ననేపథ్యంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ భారత పౌరులను హెచ్చరించింది.

టెహ్రాన్ నుంచి వెళ్లిపోండి: భారతీయులకు కేంద్రం హెచ్చరిక
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య భీకర ఘర్షణలు చోటు చేసుకుంటున్ననేపథ్యంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ భారత పౌరులను హెచ్చరించింది. వీలైనంత తొందరగా టెహ్రాన్ ను వీడాలని సూచించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో ఇజ్రాయెల్ డ్రోన్లు, క్షిపణులతో వైమానిక దాడులు చేస్తున్న సమయంలో భారతీయులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. ఇంకా పేర్లను నమోదు చేసుకోని వారు భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కోరింది. టెహ్రాన్‌లో ఉండి రాయబార కార్యాలయంతో సంబంధం లేని భారతీయ పౌరులు వెంటనే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. దీని కోసం మూడు అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్‌లను 98 9010144557, 98 9128109115, 98, 9128109109 సంప్రదించాలని సూచించారు.

పౌరులను తరలించే ప్రక్రియ షురూ..

పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా, ఇరాన్ నుంచి పౌరులను తరలించే ప్రక్రియను భారతదేశం ప్రారంభించింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. సోమ, మంగళవారం మధ్య రాత్రుల్లో 110 మంది భారతీయులతో కూడిన మొదటి బ్యాచ్ అర్మేనియాలోకి ప్రవేశించింది. ఇరాన్‌ దేశంలో చిక్కుకున్న 10,000 మందికి పైగా విద్యార్థులను సురక్షితంగా తరలించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. టెహ్రాన్ తన వైమానిక ప్రాంతాన్ని మూసివేస్తున్నట్లు పేర్కొంటూ, విద్యార్థులు అజర్‌బైజాన్, తుర్క్‌మెనిస్తాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్‌కు భూ సరిహద్దుల ద్వారా వెళ్లాలని సూచించింది. ఇజ్రాయెల్ ఇరాన్ ఐదవ రోజు దాడులు జరుగుతూనే ఉన్నాయి. రాజధాని నుంచి 320 కి.మీ దూరంలో ఉన్న ప్రధాన అణు సౌకర్యాల స్థలమైన నటాంజ్‌లో కూడా వైమానిక దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహును దాడులు ఆపేలా తక్షణమే ఒత్తిడి చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఒప్పించాలని ఇరాన్ ఒమన్, ఖతార్ సౌదీ అరేబియాను కోరింది.

Next Story