బైడెన్ కీలక నిర్ణయం: గాజాలో మానవతా సాయం అందిస్తామని వెల్లడి

by Dishanational2 |
బైడెన్ కీలక నిర్ణయం: గాజాలో మానవతా సాయం అందిస్తామని వెల్లడి
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో అత్యధికంగా ప్రభావితమవుతున్న గాజాలో మానవతా సాయం చేస్తామని తెలిపింది. ఈ విషయాన్ని యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. ఇటలీ ప్రధాని మెలోనీతో భేటీకి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. గాజాలోకి పెద్ద మొత్తంలో సహాయం అందించడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో యూఎస్ ఎయిర్ డ్రాప్ జరుగుతుందని చెప్పారు. ఆహారం, ఇతర సామగ్రి పంపిణీకి అదనపు మార్గాలను కూడా అన్వేషిస్తామని పేర్కొన్నారు. గాజాకు టన్నుల కొద్దీ సాయం అవసరమని తెలిపారు. తమ మిత్ర దేశమైన జోర్డాన్ తోనూ సంప్రదింపులు జరుపుతామని స్పష్టం చేశారు. కాగా, ఇజ్రాయెల్ కాల్పుల్లో ఏకంగా 100 మందికి పైగా పాలస్తీనియన్లు మరణంచిన మరోసటి రోజే బైడెన్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

సైనిక విమానాల ద్వారా సామగ్రి పంపిణీ!

బైడెన్ ప్రకటనతో గాజాకు మానవతా సాయం అందించేందుకు త్వరలోనే సహాయక చర్యలు ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. గాజాపై సామగ్రిని వదలడానికి యూఎస్ సైనిక విమానాలను ఉపయోగించనుంది. అయితే ఏరకమైన విమానాలు వాడనుందో ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కానీ సీ-17, సీ-130 విమానాల ద్వారా ఆహారం, ఇతర సామగ్రి సరఫరా చేయనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. వైట్ హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ..మొదటి ఎయిర్ డ్రాప్‌గా ఆహార పదార్థాలు పంపించాలని భావిస్తున్నట్టు తెలిపారు. అయితే రద్దీ విపరీతంగా ఉన్న ప్రాంతంలో ఎయిర్ డ్రాప్ చేయడం కష్టమైన ప్రక్రియేనని చెప్పారు. గాజాలో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, పిల్లలు ఆకలితో చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సముద్ర మార్గం ద్వారా కూడా సహాయక సామగ్రి అందించడాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు.



Next Story

Most Viewed