- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు..? ఐఏఈఏ, ఇరాన్ రాయబారి మధ్య భిన్న వాదనలు!
ప్రస్తుత అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అణు కేంద్రాలపై దాడుల అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) మరియు ఇరాన్ రాయబారి మధ్య పరస్పర విరుద్ధ ప్రకటనలు వెలువడ్డాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్లోని అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా-ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా దాడులు చేసినట్లు వస్తున్న వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. అయితే, ఈ దాడులపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA), ఇరాన్ రాయబారి భిన్నమైన ప్రకటనలు చేయడం గమనార్హం.
ఆధారాలు లేవన్న ఐఏఈఏ..
సోమవారం జరిగిన ఐఏఈఏ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో ఆ సంస్థ చీఫ్ రాఫెల్ గ్రాసీ మాట్లాడుతూ.. ఇరాన్లోని అణు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు తమ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. అణు కేంద్రాలు దెబ్బతిన్నాయని చెప్పడానికి ఎటువంటి సంకేతాలు కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. అయితే, గత జూన్ నెలలో జరిగిన దాడుల తర్వాత ఇరాన్ తన అణు కేంద్రాల్లోకి ఐఏఈఏ తనిఖీలను అనుమతించడం లేదని, ప్రస్తుతం ఇరాన్ అధికారులతో కమ్యూనికేషన్ కూడా పునరుద్ధరించబడలేదని గ్రాసీ వెల్లడించారు.
నటాంజ్ అణు కేంద్రమే లక్ష్యం: ఇరాన్
ఐఏఈఏ చీఫ్ ప్రకటన వెలువడిన కొద్ది సేపటికే, ఐఏఈఏలో ఇరాన్ రాయబారి రెజా నజాఫీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లోని అత్యంత కీలకమైన 'నటాంజ్' (Natanz) అణు సముదాయంపై దాడులు జరిగాయని ఆయన ధృవీకరించారు. ‘నిన్న మళ్లీ ఇరాన్ శాంతియుత అణు కేంద్రాలపై దాడులు చేశారు’ అని ఆయన అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో పేర్కొన్నారు.
కాగా, ఇరాన్ అణుబాంబు తయారీపై ఇజ్రాయెల్, అమెరికా ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా ఆ దేశ అణు కేంద్రాలపై ఇవి దృష్టి సారించాయి. నటాంజ్ కేంద్రంలో యురేనియం శుద్ధి చేసే రెండు ప్రధాన ప్లాంట్లు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా రాయిటర్స్ చెబుతోంది. గతేడాది జూన్లో జరిగిన దాడుల్లో భూమిపై ఉన్న ఒక ప్లాంట్ పూర్తిగా ధ్వంసం కాగా, భూగర్భంలో ఉన్న మరో ప్లాంట్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుత దాడుల తీవ్రత ఎంతవరకు ఉందనేది ఐఏఈఏ తనిఖీల తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే, అణు కేంద్రాలపై దాడుల వార్తలతో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.






