Iran War ship : శ్రీలంక తీరంలో ఇరాన్‌ నౌకపై దాడి ఘటన.. 80 మంది మృతి!

by Ramesh Naini |

ఇరాన్‌కు చెందిన ఒక యుద్ధనౌకపై అమెరికా జలాంతర్గామి మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కనీసం 80 మంది నావికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

Iran War ship : శ్రీలంక తీరంలో ఇరాన్‌ నౌకపై దాడి ఘటన.. 80 మంది మృతి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హిందూ మహాసముద్రం శ్రీలంక తీరానికి సమీపంలో ఇరాన్‌కు చెందిన ఒక యుద్ధనౌకపై అమెరికా జలాంతర్గామి మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కనీసం 80 మంది నావికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య జరిగిన ఈ దాడి, రెండు దేశాల మధ్య యుద్ధ తీవ్రను తెలియజేస్తోంది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ ఈ దాడిని ధృవీకరించారు. 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'లో భాగంగా తమ జలాంతర్గామి నుంచి ప్రయోగించిన టార్పెడో ఇరాన్ యుద్ధనౌకను ముంచివేసిందని ఆయన ప్రకటించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శత్రు దేశ నౌకపై అమెరికా చేసిన మొదటి అతిపెద్ద దాడి ఇదేనని పెంటగాన్ వర్గాలు వెల్లడించాయి. దాడికి సంబంధించిన వీడియోలను సైతం రిలీజ్ చేశాయి. ఈ సందర్భంగా హెగ్‌సెత్ మాట్లాడుతూ.. ఇరాన్ గగనతలాన్ని త్వరలోనే అమెరికా, ఇజ్రాయెల్ దళాలు తమ ఆధీనంలోకి తీసుకుంటాయని హెచ్చరించారు.

సహాయక చర్యలు.. గల్లంతైన 101 మంది

దాడి జరిగిన వెంటనే శ్రీలంక నౌకాదళం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. 80 మంది మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా స్పష్టం చేసింది. 32 మందిని శ్రీలంక నౌకాదళం రక్షించి, చికిత్స నిమిత్తం గాలేలోని కరాపిటియ ఆసుపత్రికి తరలించింది. మరో 101 మంది నావికుల ఆచూకీ తెలియాల్సి ఉందని శ్రీలంక రక్షణ శాఖ తెలిపింది.

వైజాగ్‌ నుంచి తిరిగి వెళ్తుండగా ప్రమాదం

దాడికి గురైన నౌక 'IRIS దేనా' (IRIS Dena) గా గుర్తించారు. ఇది మొడ్జ్-క్లాస్ ఫ్రిగేట్ రకానికి చెందిన యుద్ధనౌక. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన 'ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026'లో పాల్గొని తిరిగి ఇరాన్‌కు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం శ్రీలంకలోని సదరన్ కమాండ్ కేంద్రం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ దాడితో హిందూ మహాసముద్ర ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు.

Next Story