పెద్దపులుల కోసం నల్లమల అడవిలో వర్క్‌ షాప్

by  |
పెద్దపులుల కోసం నల్లమల అడవిలో వర్క్‌ షాప్
X

దిశ, అచ్చంపేట: నాగర్‎కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధి అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో గల ఈసీ సెంటర్‌లో పెద్దపులుల గణనపై అధికారులు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ ఫీల్డ్ మీటింగ్‌లో అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ ఫీల్డ్ డైరెక్టర్ బి. శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫేస్ -1 సర్వే ప్రకారం ప్రతి బీట్‌లో మూడు పర్యాయాలు సర్వే చేయాల్సి ఉంటుందని, ప్రతిసారి 5 కిలో మీటర్ల చొప్పున 15 కిలోమీటర్లు సర్వే చేపట్టాలని సూచించారు.

ముఖ్యంగా నది పరివాహక ప్రాంతాలు, తడి ప్రదేశాలు, మట్టి ప్రదేశాల్లో వన్యప్రాణులు సంచరించిన అడుగుజాడలను గుర్తించాలన్నారు. పెద్దపులి, చిరుతపులి, ఎలుగుబంటి, నక్క ఇతర జంతువులకు సంబంధించిన అడుగుజాడలను ఏ విధంగా గుర్తించాలి.. ఏ జంతువు జాడలు ఎంత పొడవు, వెడల్పు ఉంటుందో తదితర అంశాలపై కీలక సూచనలు చేశారు. ప్రతి బీట్‌లో జీపీఎస్ ఆధారంగా సర్వే జరగాల్సి ఉంటుందని, ప్రత్యక్ష పరోక్ష పద్ధతిలో సర్వే చేయాలని కూడా తెలిపారు.

రెండో సెషన్‌లో క్షేత్రస్థాయిలో అమ్రాబాద్ డివిజన్ పరిధిలో అధికారుల చేత సర్వే చేసే పద్ధతిపై అవగాహన కల్పించారు. ఈ అవగాహన సమావేశానికి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల నుంచి ఎఫ్‌డీవోలు, అటవీ క్షేత్ర అధికారులు, జిల్లా అటవీ శాఖాధికారి కృష్ణ గౌడ్, అమ్రాబాద్ డివిజన్ అధికారి రోహిత్, అచ్చంపేట డివిజన్ అధికారి నవీన్ రెడ్డి, రేంజర్లు ప్రభాకర్, ఈశ్వర్, మనోహర్ స్థానిక అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.



Next Story