ఉపాధిలో ‘దూరం’ లేదు!

by  |
ఉపాధిలో ‘దూరం’ లేదు!
X

దిశ, వరంగల్: కరోనా వైరస్ కట్టడికి మందు లేదని, స్వీయ నియంత్రణ ఒక్కటే ఆయుధమని, ప్రతి ఒక్కరూ సామాజికదూరం పాటించాలని ఇటీవల తరచూ వినబడుతున్న మాటలు. ప్రధాని, ముఖ్యమంత్రి నుంచి మొదలుకుని సెలబ్రిటీస్ వరకూ ప్రసార మాధ్యమాల్లో నిత్యం హెచ్చరికలతో కూడిన సూచనలు చేస్తున్నారు. దాదాపుగా అన్నివర్గాల ప్రజలు ఆ మాటలను తప్పకుండా పాటిస్తూ మహమ్మారి నివారణకు సహకారం అందిస్తున్నారు. కానీ, కొన్ని చోట్ల జనం సామాజిక దూరం పాటించడంలేదనే ప్రచారం జరుగుతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, నిత్యావసర వస్తువుల పంపిణీ సందర్భంగా ప్రజాప్రతినిధులతోపాటు అధికారులు, జనం సామాజిక దూరం అనే మాటను విస్మరిస్తున్నట్లు తెలుస్తోన్నది. ప్రధానంగా ఉపాధి హామీ కూలీలు సామాజిక దూరం పాటించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.

వణికిస్తున్న మహమ్మారి…?

రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కరోనా వైరస్ ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల వరంగల్ అర్బన్, జనగామ జిల్లాలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఆయా జిల్లాల జనం ఉలికిపాటుకు గురయ్యారు. ఈ మేరకు ఆయా ప్రాంతాలను కంటైన్‌మెంట్ ఏరియాలుగా ప్రకటించిన అధికార యంత్రాంగం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. ఆయా ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, గుంపులు గుంపులుగా ఒకచోట చేరొద్దని సూచనలు చేస్తోంది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన ఇబ్బందులు తప్పవని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఆయా జిల్లా పోలీసులు డ్రోన్ కెమెరాలతో కాలనీలను జల్లెడ పడుతున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనదారుల పట్ల నిఘా పెట్టి బైక్‌లు సీజ్ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 7 వేలకు పైగా బైక్‌లు సీజ్ చేశారు. రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో మతపెద్దలతో మాట్లాడుతున్నారు. గుంపులుగా మసీదులకు వెళ్లకుండా ఇంటి వద్దనే ప్రార్థనలు చేసుకోవాలని కోరుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యం..

గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు సామాజిక దూరం పాటించకపోవడంలో అధికారుల నిర్లక్ష్యమేనని స్పష్టమవుతోంది. కూలీలు పనిచేసే చోట గుంపులు గుంపులుగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా కిష్టు తండాలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలను కలిసి వారితో కాసేపు మాట్లాడారు. కరోనా కట్టడి చేసేందుకు సామాజిక దూరం పాటిస్తూ పనులు చేసుకోవాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు వారికి అవగాహన కల్పించాలని ఆదేశాలిచ్చారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూర్ మండలంలో ఉపాధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. మండలంలోని హౌస్ బుజుర్గ్ గ్రామంలో సుమారు 150 మంది కూలీలు పనిచేస్తున్నారు. కూలీలు సామాజిక దూరం పాటించడం లేదు. రెండురోజులుగా ఒక్కచోటే గుమిగూడి పనులు చేస్తున్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

tags:Warangal, House Bujurg Village, Employment Guarantee Works, Social Distance, Office, Corona Virus


Next Story