చారికి కమలం గాలం… గులాబీ వర్గాల్లో టెన్షన్!

by  |
చారికి కమలం గాలం… గులాబీ వర్గాల్లో టెన్షన్!
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో తలపండిన నేతగా ముద్రపడ్డ కేంద్ర మాజీ మంత్రి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి డాక్టర్ ఎస్ వేణుగోపాలచారి కోసం కమలం పార్టీ కాచుకు కూర్చుంది. ఆయన కోసం అన్ని దారులు తెరిచి రమ్మని సంకేతాలు ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. చారి టీడీపీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వివిధ పదవులు చేపట్టడంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక అనుచర గణాన్ని పెంచుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రి పదవులు అనుభవించిన ఆయన చివరకు టీఆర్​ఎస్​లో చేరారు. ముధోల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు.

అసంతృప్తి తోడైంది..!

వేణుగోపాల చారి తెలుగుదేశం ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ తో సమానంగా పదవులు అనుభవించారు. ఒక సందర్భంలో కేసీఆర్​ కన్నా హోదా అనుభవించిన చరిత్ర. మారిన రాజకీయాల నేపథ్యంలో చారి టీఆర్ఎస్​లో చేరారు. అయితే ఆయనకు ఆశించిన స్థానం దక్కడం లేదన్న ఆవేదన ఉందని అనుచర వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయన కూడా అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది.

బీజేపీ వ్యూహాత్మక గాలం..!

సుదీర్ఘ అనుభవం ఉన్న వేణుగోపాలచారి కోసం కమలం దారులు తెరిచినట్లు సమాచారం. ఈమేరకు జాతీయ స్థాయి నేత ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. జీహెచ్​ఎంసీ ఎన్నికలకు ముందే పార్టీలోకి రావాలని ఆయనపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మల్కాజిగిరి ప్రాంతంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓట్లు భారీగా ఉండడమే అందుకు కారణంగా తెలుస్తోంది. భవిష్యత్తులోనూ అదే మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం లేదంటే ముధోల్, నిర్మల్ నియోజకవర్గాల్లో ఆయనకు అవకాశం ఇచ్చేందుకు బీజేపీ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

అనుయాయులతో చర్చలు..?

బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చిన నేపథ్యంలో వేణుగోపాల చారి భవిష్యత్ రాజకీయ వ్యూహం పై అనుయాయులతో చర్చలు మొదలు పెట్టారు. రెండు రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మకాం పెట్టిన చారి తనతో మొదటి నుంచి రాజకీయ సంబంధాలు కలిగి ఉన్న నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. బీజేపీలో చేరితే ప్రయోజనమేంటి అనే కోణంలో సీనియర్లతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా బుధవారం కూడా నియోజకవర్గంలో పార్టీ సీనియర్లతో సమావేశం అయినట్లు సమాచారం. ఆయన కమల దళంలో చేరితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయంగా భారీగా మార్పులు జరిగే అవకాశాలున్నాయి.



Next Story

Most Viewed