కరణం మల్లీశ్వరిగా రకుల్ ?

by  |
కరణం మల్లీశ్వరిగా రకుల్ ?
X

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని సినీ పరిశ్రమల్లో బయోపిక్ సినిమాలు తెరకెక్కించడం కామన్‌గా మారింది. ఈ సినిమాలను భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉండటంతో.. ఫిల్మ్ మేకర్స్ వీటిపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2000 ఒలింపిక్స్- వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య ప‌త‌కం సాధించిన తొలి భార‌తీయ మ‌హిళగా రికార్డ్ క్రియేట్ చేసిన క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి జీవితాన్ని వెండితెరపై ఆవిష్క‌రించ‌నున్న విషయం తెలిసిందే. జూన్ 1న క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి పుట్టిన‌రోజు సందర్భంగా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు కానీ.. ఇందులో నటించే నటీనటుల విషయాలను వెల్లడించలేదు. కరణం మల్లీశ్వరి పాత్రలో తాప్సీ నటించనుందని ఆ మధ్య వార్తలొచ్చినా, దానిపై ఇటు చిత్ర బృందం కానీ, అటు తాప్సీ కానీ స్పందించలేదు. తాజాగా ఈ రోల్ రకుల్‌కు దక్కిందని ఫిల్మ్ నగర్ టాక్.

కరణం మల్లీశ్వరి పాత్ర పోషించాలంటే.. బరువులను ఎత్తగలిగే ఫిజిక్ ఉండాలి. అందుకే ఫిట్‌నెస్ ఫ్రీకర్ అయిన రకుల్‌ను చిత్రయూనిట్ సంప్రదించినట్లుగా సమాచారం. అయితే రకుల్ ఇంతవరకు దీనిపై గొంతు విప్పలేదు. చిత్ర బృందం కూడా అధికారికంగా దీని గురించి అనౌన్స్ చేయలేదు. అయితే రకుల్ సెలెక్షన్‌పై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. కరణం మల్లీశ్వరి కాస్త లావుగా ఉంటుందని, మరి అలాంటి పాత్రకు రకుల్ ఎలా సూట్ అవుతుందనే సందేహాలు కూడా ఉండటంతో.. చిత్ర బృందం తుదినిర్ణయం తీసుకోవడంలో సందేహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

‘రాజుగాడు’తో మంచి పేరు తెచ్చుకున్న దర్శకురాలు సంజనా రెడ్డి.. కరణం మల్లీశ్వరి బయోపిక్‌ను తెర‌కెక్కించ‌నుండ‌గా, ఇది తన కలల ప్రాజెక్టు అని తెలిపింది. ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..

Next Story

Most Viewed