ఆ ఇద్దరికి పదవులు వచ్చేనా..? సీఎం కేసీఆర్ కరుణించేనా..?

by  |
ఆ ఇద్దరికి పదవులు వచ్చేనా..? సీఎం కేసీఆర్ కరుణించేనా..?
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : వారిద్దరు సీనియర్ నాయకులే.. పార్టీకి ఆవిర్భావం నుంచి అండగా ఉన్నవారు ఒకరైతే.. పార్టీకి కీలక సమయంలో చేరిన వారు మరొకరు. ఒకరు సీఎం కేసీఆర్‌కు సన్నిహితులుకాగా.. ఇంకొకరు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటుకు దగ్గరివారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలు, టీఆర్ఎస్ పార్టీలోనూ కీలకంగా వ్యవహరించిన టీఆర్ఎస్ మాజీ రాష్ట్ర కార్యదర్శి వల్లకొండ సత్యనారాయణగౌడ్, పశ్చిమ జిల్లా టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావులకు పదవుల కోసం ఎడతెగని ఎదురుచూపులు తప్పటం లేదు. తాజాగా ఎమ్మెల్సీ పదవుల్లో అవకాశం ఇవ్వాలని కోరుతుండగా.. ఏ మేరకు ఛాన్స్ వస్తుందోనని జోరుగా చర్చ సాగుతోంది..!

పార్టీకి పని చేసిన నేతలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయపరంగా నిర్మల్ ప్రాంతం నుంచి మొదటి నుంచి కీలకమైన నాయకులున్నారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి ఈ ప్రాంతం నుంచి కీలక నాయకత్వమే ఉన్నది. అందులో ముఖ్యులుగా చెప్పుకోవాల్సింది టీఆర్ఎస్ మాజీ రాష్ట్ర కార్యదర్శి వల్లకొండ సత్యనారాయణగౌడ్, పశ్చిమ జిల్లా టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు ఇటు ఉమ్మడి జిల్లా రాజకీయాలతో పాటు పార్టీలోనూ కీలకంగా వ్యవహరించారు. వీరిద్దరు కూడా గత కొన్నేళ్లుగా టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు.

గత కొంతకాలంగా వీరికి ఎలాంటి పదవులు లేకపోవండతో తాజాగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవుల భర్తీలో అవకాశం కల్పించాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వచ్చే ఏడాది స్థానిక సంస్థల కోటాలో భర్తీ చేసే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనైనా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా భర్తీ చేసే కార్పొరేషన్ పదవుల్లోనైనా అవకాశం ఇస్తారనే ఆశతో వారి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

కేసీఆర్ కు సన్నిహితుడు

వల్లకొండ సత్యనారాయణగౌడ్ గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండగా.. అప్పటి నుంచి సీఎం కేసీఆర్ తో అనుబంధం, సాన్నిహిత్యం ఉంది. 1995లో నిర్మల్ మండలాధ్యక్షుడిగా ఉండగా.. అప్పట్లో ఉప ఎన్నికల ఇంచార్జిగా సీఎం కేసీఆర్ ఉన్నారు. అప్పట్లోనే వీరిద్దరు కలిసి ఉప ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటించగా.. అప్పటి నుంచి కేసీఆర్ తో మంచి సంబంధాలున్నాయి. ఏ ఎన్నికల సభలో అయినా కేసీఆర్ సత్యన్న అంటూ ఆయన పేరు తీసుకుని పాత ముచ్చట్లు చెప్పుకొచ్చేవారు.

సత్యనారాయణగౌడ్ 2011లో టీడీపీని వీడి.. టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా ఆయన భార్య శోభారాణికి అవకాశం లభించింది. జిల్లాల పునర్విభజన తర్వాత మరోసారి నిర్మల్ జిల్లాకు అవకాశం వచ్చినా.. ఆయన ముందుకు రాలేదు. తాజాగా ఎమ్మెల్సీ పదవుల్లో అవకాశం ఇవ్వాలని ఆయన ఇటీవల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. ఎమ్మెల్సీగా లేదా కార్పొరోషన్ పదవుల్లో తప్పకుండా అవకాశంఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.

పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్‌లోనే..

కూచాడి శ్రీహరిరావు పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ బలోపేతం కోసం పని చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. పశ్చిమ జిల్లా అధ్యక్షుడిగా, నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జిగా పార్టీలో మొదటి నుంచి ఉన్నారు. ఆయన గతంలో టీఆర్ఎస్ నుంచి 2009, 2014లో రెండుసార్లు పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2014లో బీఎస్పీ నుంచి గెలిచిన అల్లోల ఇంద్రకరణ్రెడ్డి టీఆర్ఎస్‌లో బీఎస్ఎల్పీని విలీనం చేయగా.. తర్వాత మంత్రి అయ్యారు. దీంతో 2018లో టీఆర్ఎస్ నుంచి అల్లోల పోటీ చేయగా.. శ్రీహరిరావుకు అవకాశం రాలేదు. దీంతో పార్టీ కోసం, అభ్యర్థుల విజయం కోసం పని చేశారు.

ఆయన తాజాగా ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరుకు విన్నవించారు. కనీసం నామినేట్ పోస్టుల్లో అయిన సర్దుబాటు బాటు చేయాలని కోరినట్లు తెలిసింది. కేటీఆర్ కుటుంబంతో బంధుత్వం ఉండగా.. అదీకాక పశ్చిమ జిల్లా టీఆర్ఎస్ పార్టీకి ఆవిర్భావం నుంచి ఆయనే అండగా ఉన్నారు. అలాంటి నేతకు తాజాగా అవకాశం వస్తుందనే ఆశతో ఆయన వర్గీయులు, సన్నిహితులు ఉన్నారు.


Next Story

Most Viewed