ఆవుల కోసం.. కృష్ణుడి భజన కీర్తనలు

by  |
ఆవుల కోసం.. కృష్ణుడి భజన కీర్తనలు
X

దిశ, ఫీచర్స్ : మానవ జీవితంలో సంగీతం అంతర్భాగమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆనందానికి, సంతృప్తికి మూలమైన మ్యూజిక్‌తో ఇతరత్రా మానసిక ప్రయోజనాలు కూడా అనేకం ఉన్నాయి. శరీరానికి సహజమైన అనుభూతిని కలిగించే రసాయనాలను ప్రేరేపించడంతో పాటు మానసిక స్థితిని ఉత్తేజపరిచేందుకు సాయపడుతుంది. అయితే ఇది కేవలం మనుషులకేనా? జంతువులకు కూడా ఇది ప్రయోజనం కలిగిస్తుందా? అంటే అవుననే చెప్పాలి. ఉత్తరప్రదేశ్‌, హమీర్‌పూర్ జిల్లాలోని కన్హా గౌశ్రయ స్థల్‌లోని ఆవులు ఇప్పుడు ప్రతిరోజూ లౌడ్‌స్పీకర్లలో తక్కువ వాల్యూమ్‌లో భజనలు వింటున్నాయి.

ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం గోవులకు శ్రావ్యమైన కృష్ణుని కీర్తనలను వినిపించాలని త్రిపాఠి నగర్ పంచాయితీ అధికారులను జిల్లా మెజిస్ట్రేట్ చంద్ర భూషణ్ కోరారు. గోశాలల వద్ద వినిపించే సంగీతానికి అనుగుణంగా ఆవులు స్పందిస్తాయనేది విశ్వాసం కాగా.. ఎస్పీ కమలేష్ దీక్షిత్‌తో కలిసి గతవారం కన్హా గోశాలకు వచ్చిన మెజిస్ట్రేట్ శీతాకాలాన్ని తట్టుకునేందుకుగాను ఆవులకు శాలువాలు ఇచ్చారు.

ఇక తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న ఆవుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంబులెన్స్ సేవలు కూడా ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి లక్ష్మీ నారాయణ్ చౌదరి ఇటీవలే తెలిపారు. ఈ నూతన పథకానికి 515 అంబులెన్స్‌లు సిద్ధంగా ఉన్నాయన్నారు. 112 ఎమర్జెన్సీ సర్వీస్ నంబర్‌తో ఈ కొత్త సర్వీస్ అందుబాటులోకి రానుంది. ఈ పథకం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆవులకు త్వరగా చికిత్స అందించేందుకు సాయపడుతుందని అన్నారు. సర్వీస్ కోసం రిక్వెస్ట్ చేసిన 15 – 20 నిమిషాల వ్యవధిలో వెటర్నరీ డాక్టర్, ఇద్దరు సహాయకులతో కూడిన అంబులెన్స్ వస్తుందని ఆయన వివరించారు.

Next Story