ఆ 17 మందిలో ఎమ్మెల్సీలు అయ్యేది ఎవరో..?

by  |
Legislative Council
X

దిశ, తెలంగాణ బ్యూరో : శాసనసభలో ఖాళీ అయిన మండలి స్థానాల కోసం అధికార పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. ఉమ్మడి పది జిల్లాల నుంచి నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఖాళీ అయిన 6 శాసనసభ్యుల స్థానాలకు ఒకటిన్నర డజన్ మందికి టికెట్ ఇస్తామని సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లు హామీ ఇచ్చారు. వీరు గాక మరికొంత మంది ఎమ్మెల్సీ టికెట్ ను ఆశిస్తున్నారు. పార్టీలో పదవులను అనుభవించేవారు కాకుండా కొత్తవారికి మండలిలో అవకాశం కల్పించే ఆలోచనలో పార్టీ అధినేత కేసీఆర్ ఉన్నట్లు సమాచారం.

శాసనసభ్యుల కోటా నుంచి మండలికి ఎన్నికైన ఆరుగురు సభ్యుల పదవీకాలం జూన్ 3వ తేదీతో ముగిసింది. గవర్నర్ కోటలో ఎన్నికైన ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకరి పదవీకాలం జూన్ 16తో ముగిసింది. వీరంతా అధికార పార్టీకి చెందిన సభ్యులే. ఈ జాబితాలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, చీప్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, ఆకుల లలిత కాగా, గవర్నర్ కోటాలో ప్రాతినిధ్యం వహిస్తున్న మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అయితే గవర్నర్ కోటా స్థానంలో పాడి కౌశిక్ రెడ్డిని నియమించారు. అయితే మిగిలిన 6స్థానాల కోసం పార్టీకి చెందిన నేతలకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హామీలు ఇవ్వగా, మరికొందరు తమకు కేటాయించాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా పావులు కదుపుతున్నారు. అయితే సీఎం కేసీఆర్ మాత్రం ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

ఎమ్మెల్సీ ఖాళీ స్థానాల భర్తీలో తమకు అవకాశం దక్కుతుందని నేతలు ఆశతో ఎదురు చూస్తున్నారు. తమకు కేసీఆర్, కేటీఆర్ హామీ ఇచ్చారని ఇక టికెట్ విషయంలో ఢోకా లేదని పేర్కొంటున్నారు. అయితే 6 స్థానాలకు సుమారు 17 మందికి పైగా హామీలు ఇవ్వగా ఎవరికి ఇస్తారో అనేది చర్చనీయాశంగా మారింది. ఇదిలా ఉంటే గత నెల 21వ తేదీన చేరిన పాడి కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవిని అప్పగించడంతో పలువురు సీనియర్లు లోలోన మదనపడుతున్నారు. పదిరోజుల్లోనే పార్టీలో చేరిన వారికి ఇచ్చి.. ఏళ్ల తరబడి పార్టీని అంటిపెట్టుకొని ఉన్నవారిని, రాజకీయ అనుభవం ఉన్న వారికి మొండిచెయ్యి చూపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇంకా 6 ఎమ్మెల్సీలతో పాటు కార్పొరేషన్, నామినేటెడ్ పదవుల భర్తీ సమయంలో న్యాయం జరుగుతుందని మరికొంతకాలం వేచిచూసే ధోరణిలో ఉన్నట్లు సమాచారం.

  • ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి క్యామ మల్లేశం, మేడ్చల్ కు చెందిన రాజశేఖర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, కొత్త మనోహర్ రెడ్డికి పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. వీరు గాక నాగేందర్ గౌడ్, పోరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రామ్మోహన్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి టికెట్టు ఆశిస్తున్నట్లు సమాచారం.
  • హైదరాబాద్ నుంచి మాజీ మేయర్ బొంతు రాంమ్మోహన్ కు జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు.
  • వరంగల్ ఉమ్మడి జిల్లాలో నాగుల వెంకటేశ్వర్లు, మధుసూదనాచారి, కడియం శ్రీహరిలకు టికెట్ ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, సుందర్ రాజు, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ మంత్రి చందులాల్ తనయుడు ప్రహ్లాద్, గుడిమల్ల రవికుమార్ టికెట్ ను ఆశిస్తున్నారు.
  • నల్లగొండ జిల్లాలో మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నాయకుడు ఎంసీ కోటిరెడ్డి, చేనేత వర్గం నుంచి కర్నాటి విద్యాసాగర్ కు కేసీఆర్ హామీ ఇవ్వగా, ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, చాడ కిషన్ రెడ్డి, చకిలం అనిల్ కుమార్, ఎంసీ కోటిరెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, వేముల వీరేశం, దూదిమెట్ల బాల్ రాజుయాదవ్‌, వేమిరెడ్డి నర్సింహా రెడ్డి కూడా ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
  • కరీంగర్ నేతలకు కేసీఆర్ ఎలాంటి హామీ ఇవ్వలేదు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో పది రోజుల క్రితం చేరిన కౌశిక్ రెడ్డికి రాష్ట్ర స్థాయి పదవిని ఇస్తామని చెప్పి…. గవర్నర్ కోట నుంచి ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు సీఎం కేసీఆర్. అయితే టి. సంతోష్ కుమార్, పిట్టల రవీందర్, ఎల్. రమణ, ఇనుగాల పెద్దిరెడ్డి లు ఎమ్మెల్సీ టికెట్ ను ఆశిస్తున్నారు.
  • నిజామాబాద్ నుంచి తాజా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితతో పాటు మాండవ వెంకటేశ్వర్లు, అరికెళ్ల నర్సింహారెడ్డి, ముజీబుద్దిన్, ఈగ గంగారెడ్డిలకు కేసీఆర్ హామీ ఇచ్చారు.
  • ఖమ్మం నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు ఎమ్మెల్సీ పదవికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గవర్నర్ కోటా కింద వస్తుందని ఆశించినప్పటికీ ఇవ్వలేదు. అయితే వీరు ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవిని సైతం ఆశిస్తున్నట్లు తెలిసింది.
  • ఆదిలాబాద్ జిల్లా నుంచి సీవీరావు, సత్యనారాయణగౌడ్, మెదక్ నుంచి ఫరీదుద్దీన్, మహబూబ్ నగర్ నుంచి జనార్దన్, శివకుమార్, జూపల్లి కృష్ణారావు నుంచి ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Next Story

Most Viewed