ఎండలు బాబోయ్ ఎండలు.. 124 ఏళ్లలో కెల్లా అత్యంత వేడి నెలగా ఫిబ్రవరి

by Yella Dhawani Reddy |

వేసవి ప్రారంభానికి ముందే సూర్యుడు సుర్రుమంటున్నాడు.

ఎండలు బాబోయ్ ఎండలు.. 124 ఏళ్లలో కెల్లా అత్యంత వేడి నెలగా ఫిబ్రవరి
X

దిశ, వెబ్ డెస్క్: వేసవి ప్రారంభానికి ముందే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఫిబ్రవరి (February) మొదటి వారం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 7-8 గంటలకే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇక మధ్యాహ్నం సమయాల్లో అయితే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు (high temperatures) నమోదవుతున్నాయి. ఈ క్రమంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ (IMD) పేర్కొంది. మార్చి రెండు లేదా మూడో వారంలోనే తెలుగు రాష్ట్రాల్లో వడగాలులు ప్రభావం చూపుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్‌-జూన్‌ మధ్యలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు IMD వడగాలుల హెచ్చరికలు జారీ చేసింది.

ఇక గత 124 ఏళ్లలో అత్యంత వేడి నెలగా ఫిబ్రవరి నమోదైందనట్లు వాతావరణ శాఖ తెలిపింది. గత నెలలో సగటున 22 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైందని, 1901 తర్వాత ఫిబ్రవరిలో ఈ స్థాయి సగటు నమోదవడం ఇదే తొలిసారి అని పేర్కొంది. అంతేకాదు, చరిత్రలోనే తొలిసారిగా ఈ ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు ఏకంగా 15 డిగ్రీల పై చిలుకు నమోదై సరికొత్త రికార్డు నెలకొల్పాయి. ఇది 2023 ఫిబ్రవరిలో నమోదైన సగటు అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతను కూడా అధిగమించింది.

ఈ పరిస్థితులపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకస్మాత్తుగా వరుణుడు కరుణిస్తే తప్ప వచ్చే మూడు నెలలు ప్రచండమైన ఎండలు తప్పవని చెబుతున్నారు. అలాగే, కర్బన ఉద్గారాలు, పట్టణీకరణ, అడవులు తగ్గడం వంటి కారణాల వల్లే ఎండలు మండుతున్నాయని అంటున్నారు.

ఇక పెరుగుతున్న ఎండ తీవ్రతకు తగ్గట్లుగా ఆహార‌పు అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటికి వెళ్లకూడదని సూచిస్తున్నారు. శరీరంలో నీటి శాతం పెంచే తాజా పండ్లను అధికంగా తీసుకోవాలని చెబుతున్నారు. నూనెతో చేసిన వేపుళ్లు, హోటల్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని, మజ్జిగ, కొబ్బరి నీరు, రాగి జావ తాగితే మంచిదంటున్నారు.

Next Story