పరువు నష్టం దావా వేస్తాం.. భూముల వేలంపై ప్రభుత్వం ప్రకటన

by  |
TS Government
X

దిశ, తెలంగాణ బ్యూరో : కోకాపేట, ఖానామెట్ భూముల వేలంలో అవకతవకలు జరుగలేదని, కొన్ని వార్తాపత్రికల్లో వచ్చినవి నిరాధారమైనవని అని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ చేపట్టి భూముల వేలం పారదర్శకంగా జరిగిందన్నారు. నివాస, వాణిజ్య, సంస్థాగత, ప్రజా అవసరాలకు సంబంధించి ప్రభుత్వం భూములను వేయడం గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ, దేశంలోని ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక, ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో భూముల అమ్మకం ప్రక్రియ నిరంతరం జరుగుతుందన్నారు.

రెవెన్యూ సమూపార్జన అయినప్పటికీ, పట్టణాల్లోని ప్రణాళిక బద్ధమైన వృద్ధి, రోజురోజుకు పెరుగుతున్న నివాస, వాణిజ్య సంబంధమైన అవసరాలను తీర్చడం ముఖ్య ఉద్దేశం అన్నారు. కోకాపేట, ఖానామెట్ భూములు నగరంలో అదనపు నివాస, కార్యాలయ అవసరాలను తీర్చడానికి ఎంతగానో దోహదపడ్తాయని, అభివృద్ధికి దోహదపడే ప్రదేశాలు కావడంతో భూములవేలం వేశామన్నారు. ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల వేలం గతంలోనే జరిగిందని, ఇప్పటి వేలం కేవలం ఒక కొనసాగింపు ప్రక్రియ మాత్రమే అన్నారు.

ఈ నెల 16న కోకాపేటలో 49.45 ఎకరాల్లో 8 ప్లాట్లు, ఖానామెట్ లో 15.01 ఎకరాల్లో 5 ప్లాట్లను కేంద్రప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ లిమిటెడ్, ఈ-ఆక్షన్ ఆధారిత ఆన్ లైన్ బిడ్ పద్దతి ద్వారా పారదర్శకంగా ఎలాంటి అవకతవకలు లేకుండా నిర్వహించామన్నారు. వేలంపాటలో కనీస నిర్ణీత ధరను ఎకరాలకు రూ.25కోట్లుగా నిర్ణయిస్తూ ఆన్లైన్ విధానంతో పాటదారులు రూ.20లక్షలు మరియు ఆ విలువకు బహుళంగా పెంచుకునే వెసులుబాటు కల్పించామని, ఎక్కువ పాటపడినవారికే ఆ ప్లాట్లను అప్పగించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. భూముల వేలంకు సంబంధించి ప్రసారసాధనాల్లో విస్తృత ప్రచారం చేశామని తెలిపారు. దీంతో ఎక్కువ మంది బిల్డర్లు పాల్గొనడంతో ప్రభుత్వానికి మంచి మార్కెట్ ధర వచ్చిందన్నారు.

కోకాపేట, ఖానామెట్ భూముల వేలంలో పోటీని నిలువరించామని, ప్రభుత్వానికి రెవెన్యూను తగ్గించామని, బిడ్డింగ్‌లో కొన్ని సంస్థలకు మేలు చేశామనే ఆరోపణలు నిరాధారమైనవి, ఊహాతీమైనవి అన్నారు. వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా, పారదర్శకమైన పద్దతిని తప్పుపట్టడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్ఠతకు భంగం కలిగించే చర్యలను ఉపేక్షించబోమన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి కల్పిత ఆరోపణలపై న్యాయపరమైన పరువునష్టం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

Next Story

Most Viewed