కరీంనగర్.. రిజర్వాయర్ల ప్రజెంట్ డీటెయిల్స్

by  |
కరీంనగర్.. రిజర్వాయర్ల ప్రజెంట్ డీటెయిల్స్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్లు, బ్యారేజీలో సామర్థ్యానికి చేరువకు చేరుకుంటున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద నీరు ఉధృతంగా ప్రాజెక్టుల్లోకి వచ్చి చేరుతోంది. సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు ప్రాజెక్టు సామర్థ్యం 25 టీఎంసీలు కాగా 20 టీఎంసీల వరకు వరద నీరు వచ్చింది. ఇన్ ఫ్లో 5 వేల క్యూసెక్కుల నీరు వస్తోందని, మిషన్ భగీరథ అవసరాల కోసం 149 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నామని ఈఈ రామకృష్ణ తెలిపారు.

కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేరు డ్యాం వరద నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. మోయ తుమ్మెద వాగు నుండి వస్తున్న వరద నీటి ప్రవాహం కొంతమేర తగ్గినప్పటికీ సాయంత్రం వరకూ ఇన్ ఫ్లో పెరిగే అవకాశాలు ఉన్నాయి. 24 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఎల్ ఎండీలో 14 టీఎంసీల నీరు రాగా, 21 వేల క్యూసెక్కుల వరద నీరు మోయ తుమ్మెద, మానేరు వాగుల నుండి వస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద కూడా వరద ప్రవాహం తీవ్రంగానే ఉంది.

భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజ్ కి 8 లక్షల 50 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా 9 లక్షల 87 వేల క్యూసెక్కుల వరద నీటిని 65 గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు. అన్నారం బ్యారేజ్ 20 గేట్లు ఎత్తి 18 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 14 లక్షల 7 వేలుగా ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 14 వేల క్యూసెక్కుల వరద నీరు ఇన్ ఫ్లో వస్తుండగా 5 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.



Next Story

Most Viewed