ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చే మొదటి ప్రాధాన్యత ఓట్లు అంతే..?

by  |
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చే మొదటి ప్రాధాన్యత ఓట్లు అంతే..?
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరు రోజురోజూకీ రసవత్తరంగా మారుతోంది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న అభ్యర్థుల బలాబలాల సంగతి ఎలా ఉన్నా.. సీఎం కేసీఆర్ మాత్రం ఫుల్ క్లారిటీతో ఉన్నారట. రాష్ట్రంలో ప్రస్తుతం జరగుతున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఇంటెలిజెన్స్ నివేదికలను సీఎం కేసీఆర్ ఇటీవల తెప్పించుకున్నారు. ఆ నివేదికలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. దీంతో అధికార పార్టీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే.. లోపల వణికిపోతోంది. హైదరాబాద్-మహబూబ్‌నగర్-మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సంగతి అలా ఉంచితే.. టీఆర్ఎస్‌కు సిట్టింగ్ స్థానమైన వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గమే చెమటలు పట్టిస్తోంది. దీనిపై సీఎం కేసీఆర్ ఇటీవల ఆయా జిల్లాల మంత్రులతో పూర్తిస్థాయిలో రివ్యూ నిర్వహించారు. ఇంటలిజెన్స్ నివేదిక ప్రకారం.. ఆయా మంత్రులకు సరికొత్త దిశానిర్దేశం చేశారు.

సిట్టింగ్ స్థానంలోనే చెమటలు..

అధికార టీఆర్ఎస్ పార్టీకి వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం సిట్టింగ్ స్థానంగా ఉంది. ఇక్కడ గత ఎన్నికల్లో గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలోకి దిగారు. అయితే ముందస్తు ఈ ఎన్నికల్లో గెలుపు సునాయసమేనని ఇటు పల్లా.. అటు పార్టీ అధిష్టానం భావించింది. కానీ ఊహించని రీతిలో ఈ నియోజకవర్గం నుంచి అభ్యర్థులు పోటీలో ఉండడం.. ప్రైవేటు యూనివర్సిటీల వ్యవహారం, నిరుద్యోగ భృతి, పీఆర్సీ, కాంట్రాక్టు లెక్చరర్ల బదిలీల అంశం గెలుపు తాలూకు పరిస్థితులను తారుమారు చేసింది. నలుగురు మంత్రులు కాళ్లకు బలపం కట్టుకుని తిరిగి ప్రచారం చేసినా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా మారడం లేదు.

ఓటింగ్‌పై అంచనాలు ఇలా..

వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులకు తోడు మరో ఇద్దరు ముగ్గురు ఇండిపెండెట్ అభ్యర్థులు ఓటింగ్ సరళిని తారుమారు చేశారనే చెప్పారు. పోటీలో ప్రొఫెసర్ కోదండరాం, చెరుకు సుధాకర్, తీన్మార్ మల్లన్న, రాణిరుద్రమ వంటి వారి వల్ల ప్రధాన పార్టీల అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓట్లు సగానికి పైగా తగ్గనున్నాయి. అందులో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓట్లు 30 శాతం పడతాయని, బీజేపీకి 50 శాతం, మిగిలినవారికి 20 శాతం మొదటి ప్రాధాన్యత ఓట్లు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అధికార టీఆర్ఎస్ పార్టీ గెలవాలంటే.. రెండో ప్రాధాన్యత ఓట్లే కీలకమని సీఎం కేసీఆర్ గుర్తించినట్టు తెలిసింది. మొదటి ప్రాధాన్యత ఓట్లతో పాటు రెండో ప్రాధాన్యత ఓట్లే గెలుపు బాటలోకి తీసుకెళ్తుందని నివేదికలో తేటతెల్లమయ్యినట్టు తెలుస్తోంది. ఆ మేరకు మూడు జిల్లాల మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. దీంతో క్షేత్రస్థాయిలో మొదటి ప్రాధాన్యత ఓట్ల కంటే రెండో ప్రాధాన్యత ఓట్లు టీఆర్ఎస్ గెలుపులో కీలకం ఖాయంకానున్నాయి.



Next Story

Most Viewed